ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:33 AM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలోని షాబాద్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని ...
చేవెళ్ల, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలోని షాబాద్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని కందవాడ గ్రామానికి చెందిన శేరి కృష్ణారెడ్డి రెండో కుమారుడు సాత్విక్రెడ్డి (18) మొయినాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం కూడా షాబాద్ చౌరస్తా వద్ద కాలేజీ బస్సు కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో ఓ ఆర్టీసీ బస్సు దాని ముందున్న కారును తప్పించబోయి రోడ్డు పక్కన నిలబడి ఉన్న సాత్విక్రెడ్డిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానికులు చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు.