రైలు ప్రయాణ అనుభవాలు రాయండి..నగదు బహుమతులు గెలవండి!
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:19 AM
రైలు ప్రయాణంలో ఎదురైన మధుర జ్ఞాపకాలను, భావోద్వేగాలను పంచుకోవాలనుకునే ప్రయాణికుల కోసం రైల్వేబోర్డు ‘రైల్యాత్ర వృత్తాంత్ ...
రైల్యాత్ర వృత్తాంత్ పురస్కార్ యోజన పోటీలు
జూలై 31లోగా ఎంట్రీలను పంపాలి: దక్షిణమధ్యరైల్వే
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రైలు ప్రయాణంలో ఎదురైన మధుర జ్ఞాపకాలను, భావోద్వేగాలను పంచుకోవాలనుకునే ప్రయాణికుల కోసం రైల్వేబోర్డు ‘రైల్యాత్ర వృత్తాంత్ పురస్కార్ యోజన’ పేరుతో జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు దక్షిణమధ్యరైల్వే శనివారం ప్రకటించింది. మొదటి బహుమతిగా రూ.10,000, రెండో బహుమతి రూ.8,000, మూడో బహుమతిగా రూ.6,000 నగదు పురస్కారం లభిస్తుందని సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. వీటితో పాటు మరో ఐదుగురికి రూ.4వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులను కూడా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు తమ ప్రయాణ అనుభవాన్ని తప్పనిసరిగా హిందీలో రాయాల్సి ఉంటుంది. వ్యాసం కనీసం 3,000 పదాల నుంచి గరిష్ఠంగా 3,500 పదాల పరిమితిలో ఉండాలి. మీ వ్యాసం ప్రారంభంలోనే పేరు, వయస్సు, హోదా, నివాస లేదా కార్యాలయ చిరునామా, మాతృభాష, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వంటి వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. పూర్తయిన వ్యాసాన్ని రెండు ప్రతులలో సిద్ధం చేసి.. అసిస్టెంట్ డైరెక్టర్, హిందీ (శిక్షణ), రూమ్ నెం.316, రైల్వే శాఖ (రైల్వేబోర్డ్), తిలక్ బ్రిడ్జ్, ఐటీవో, న్యూఢిల్లీ-110002 చిరునామాకు జూలై 31లోగా పంపాలని సీపీఆర్వో సూచించారు.