ఆదాయపు పన్ను వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి
ABN , Publish Date - May 30 , 2026 | 04:41 AM
ఆదాయపు పన్ను వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదాయపు పన్నుశాఖ ప్రధాన కమిషనర్(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) బత్తిని సురేష్ కోరారు.
ఐటీ శాఖ ప్రధాన కమిషనర్ బత్తిని సురేష్
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి) : ఆదాయపు పన్ను వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదాయపు పన్నుశాఖ ప్రధాన కమిషనర్(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) బత్తిని సురేష్ కోరారు. అన్ని రిపోర్టింగ్ సంస్థలు సకాలంలో, కచ్చితంగా, సంపూర్ణంగా, బాధ్యతాయుతంగా నివేదికలు సమర్పించి పన్ను వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 కింద అమలులోకి రానున్న స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్(ఎస్ఎఫ్టీ) అందించే విధానంపై అవగాహన కల్పించేందుకు ఆదాయపు పన్ను శాఖ ఇంటెలిజెన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్(ఐ అండ్ సీఐ) విభాగం హైదరాబాద్లో శుక్రవారం ‘‘ప్రారంభ్’’ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టంలోని నిబంధనలను రిపోర్టింగ్ సంస్థలకు వివరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బత్తిని సురేష్ మాట్లాడుతూ... నూతన అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు, కంపెనీలు, హోటళ్లు, వంటి సంస్థలు తమ సాఫ్ట్వేర్ వ్యవస్థ, లావాదేవీల నిర్వహణ విధానాలు, ధ్రువీకరణ యంత్రాంగాల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఫామ్-97, ఫామ్-98, ఫామ్-165 ద్వారా డిజిటల్ నమోదులు సులభతరం అవుతాయని తెలిపారు. సకాలంలో, కచ్చితంగా ఎస్ఎఫ్టీ నివేదికలు సమర్పిస్తున్న సంస్థల కృషిని గుర్తిస్తూ సహకార బ్యాంకులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఐదు సంస్థలను సత్కరించారు.