1000 కోట్ల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:01 AM
హైదరాబాద్ ఐటీ కారిడార్లో కాబ్జాకు గురవుతున్న మరో భారీ విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఖానామెట్ పరిధిలో ఆక్రమణలు తొలగించి....
ఖానామెట్లోని ఐదెకరాల స్థలంలో ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్ సిటీ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఐటీ కారిడార్లో కాబ్జాకు గురవుతున్న మరో భారీ విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఖానామెట్ పరిధిలో ఆక్రమణలు తొలగించి, 5 ఎకరాల ప్రభుత్వం స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. మార్కెట్ విలువ ఆ భూమి ధర సుమారు రూ.1,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖానామెట్ గ్రామ పరిధిలోని మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్కు వెళ్లే మార్గంలో గల సర్వేనంబర్ 42లోని ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. రెండు తాత్కాలిక షెడ్లు వేసి, ఓ గది నిర్మించారు. దాని చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మాణం ప్రారంభించగా.. రెవెన్యూశాఖ నుంచి హైడ్రాకు ఫిర్యాదు అందింది. భూమి తనదని చెబుతూ.. అందులోకి ప్రభుత్వ అధికారులనూ రానివ్వకుండా కబ్జాదారుడు అంతకుముందు అడ్డుకున్నాడు. రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణలు తొలగించింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.