రూ. 1.10 లక్షల కోట్ల భూమికి హైడ్రా రక్షణ
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:29 AM
హైడ్రా ఇప్పటివరకు రూ.1.10 లక్షల కోట్ల విలువైన 2,500 ఎకరాల భూమిని కబ్జా కోర ల నుంచి కాపాడినట్లు ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
అన్యాక్రాంతమైన 2,500 ఎకరాల ప్రభుత్వ భూమికి విముక్తి
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి
హైదరాబాద్ సిటీ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): హైడ్రా ఇప్పటివరకు రూ.1.10 లక్షల కోట్ల విలువైన 2,500 ఎకరాల భూమిని కబ్జా కోర ల నుంచి కాపాడినట్లు ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మరో 40 రోజుల్లో హైడ్రాను ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతుందని, మరో ఏడాదిలో సంస్థ పరిరక్షించే భూముల విలువ రూ.2 లక్షల కోట్లు దాటుతుందని చెప్పారు. తాజాగా పుప్పాలగూడలో రూ.30 వేల కోట్ల విలువైన 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా కంచె వేసింది. దీంతో సంస్థ కాపాడిన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. జూలై 19, 2024న ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని ఏర్పాటు చేసింది. ఆక్రమణలపై దూకుడైన చర్యలతో తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా హైడ్రాకు గుర్తింపు లభించింది. గాజులరామారం సర్వే నెం.307లో హైడ్రా 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడగా.. దానిలో కొంత భూమిని వివిధ ప్రభుత్వ విభాగాలకు కేటాయించారు. అమీన్ఫూర్లో 861 ఎకరాలు, ఖాజాగూడలోని ముష్కిన్ చెరువులో 52.2 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. సెప్టెంబరు, 2025 నాటికి 96 డ్రైవ్లు నిర్వహించి.. 581 ఆక్రమణలు తొలగించడం ద్వారా.. రూ.50 వేల కోట్ల విలువైన 923.14 ఎకరాల భూమిని కాపాడినట్లు రంగనాథ్ సోమవారం తెలిపారు.