ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో 8.55లక్షల టోకరా
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:55 AM
సైబర్ పోలీసులు ఎంత అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నా సాధారణ ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు.
ఓ వ్యాపారిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
ఆన్లైన్లో పరిచయమై ప్రేమిస్తున్నాని చెప్పిన మహిళ చేతిలో మోసపోయిన మరో వ్యక్తి
లోన్ తీసుకొని మరీ నకిలీ సంస్థలో పెట్టుబడి
4.43లక్షలు నష్టపోయిన హైదరాబాద్ వాసి
హైదరాబాద్ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): సైబర్ పోలీసులు ఎంత అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నా సాధారణ ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఆన్లైన్ ట్రేడింగ్లో లాభాల ఆశతో ఒకరు, ప్రేమిస్తున్నాని చెప్పి నమ్మించిన అమ్మాయి చేతిలో మరొకరు, ఓఎల్ఎక్స్లో కారు కొనబోయి ఇంకొకరు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటనలు హైదరాబాద్లో తాజాగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టకు చెందిన సురేందర్రెడ్డి అనే వ్యాపారికి ఏప్రిల్లో ఓ వాట్సాప్ గ్రూపులో గీతాంజలి, శుభమ్, అమిత్ పేర్లతో ముగ్గురు పరిచయం అయ్యారు. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. ఓ ‘ఏపీకే ఫైల్’ను పంపించారు. దానిపై క్లిక్ చేయించి ట్రేడింగ్ ఖాతాలు తెరిపించారు. బాధితుడు దశలవారీగా ట్రేడింగ్ ఖాతాల్లో డబ్బు జమచేశాడు. నిందితులు కూడా భారీ లాభాలు వస్తున్నట్లు ఖాతాల్లో చూపించారు. అయితే, మే నెలలో సురేందర్ ఆ డబ్బును ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా, వారు ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితేనే మొత్తం డబ్బు విడుదల చేస్తామని చెప్పి కొంత డబ్బు రిటర్న్ ఇచ్చి మోసం చేశారు. తాను రూ.8.55 లక్షలు నష్టపోయానని సురేందర్రెడ్డి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, నల్లగండ్లలో ఉంటున్న రాహుల్(41)కు ఫిబ్రవరి 5న ఫేస్బుక్ ద్వారా దియాశర్మ పేరుతో ఓ మహిళ పరిచయమైంది. రాహుల్ తాను అవివాహితుడినని ఆమెకు చెప్పాడు. తర్వాత కొద్ది రోజులకే దియా రాహుల్తో ప్రేమిస్తున్నానని నమ్మబలికింది.
తాను బెంగళూరులో జిమ్ పరికరాల వ్యాపారం నిర్వహిస్తున్నానని, ఆన్లైన్ వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఆదాయం వస్తుందని, ఇద్దరం కలిసి మంచి జీవితం గడపవచ్చని ప్రలోభపెట్టింది. ఆమె సూచన మేరకు బాధితుడు ఓ సంస్థ పేరుతో రూపొందించిన నకిలీ వెబ్సైట్లో తన పేరుతో ఆన్లైన్ జిమ్ స్టోర్ తెరిచాడు. అయితే, జిమ్ పరికరాలకు ముందుగా డిస్ట్రిబ్యూటర్ ధర చెల్లించాలని, అనంతరం లాభంతో కూడిన మొత్తం తిరిగి వస్తుందని దియా నమ్మించింది. బాధితుడు ఇందుకోసం టాటా క్యాపిటల్ నుంచి రూ.4 లక్షల రుణం తీసుకుని ఇన్వెస్ట్ చేశాడు. మొత్తం రూ.4.43లక్షలు నష్టపోయాడు. తీసుకున్న లోన్కు ఈఎంఐలు కడుతున్నాడు.