రూ.17 కోట్ల మత్తుమందులు స్వాధీనం
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:45 AM
మత్తుమందులు తయారుచేస్తున్న ముఠాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు దాడులు చేసి, వారి రహస్య ల్యాబరేటరీ గుట్టు బట్టబయలు చేశారు.
మౌలాలీలో ఎన్సీబీ దాడులు.. ముగ్గురి అరెస్టు
కల్లు కల్తీ లక్ష్యంగా ఎపిడ్రిన్ తయారీ.. ముఠా గుట్టురట్టు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : మత్తుమందులు తయారుచేస్తున్న ముఠాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు దాడులు చేసి, వారి రహస్య ల్యాబరేటరీ గుట్టు బట్టబయలు చేశారు. కల్లు కల్తీలో కీలకమైన అల్ర్పాజోలం, ఎపిడ్రిన్ తయారీ లక్ష్యంగా మౌలాలిలోని ఇండస్ర్టియల్ ఏరియాలో ఒక ముఠా పనిచేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులకు సమాచారం అందడంతో ఈ దాడి నిర్వహించారు. ల్యాబరేటరీలో ఎపిడ్రిన్, అల్ర్పాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలతో పాటు రెండు పెద్ద డ్రమ్ముల్లో నిల్వఉంచిన 69 కిలోల అల్ర్పాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందుల తయారీదారు అయిన సైంటిస్టు, ముడి సరుకును సరఫరా చేస్తున్న వ్యక్తిని, ఈ మందులను కల్లు దుకాణాలకు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. సీజ్ చేసిన మాదకద్రవ్యాల విలువ రూ.17.40కోట్లు ఉంటుందని ఎన్సీబీ అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి అల్ర్పాజోలం పూర్తి స్థాయిలో సిద్ధం అయిన నేపథ్యంలో దానిని టాబ్లెట్ల రూపంలోకి మారిస్తే ధర ఎక్కువగా ఉంటుందని మత్తు టాబ్లెట్ల తయారీవైపు కూడా తయారీదారులు ఆలోచన చేసినట్లు సమాచారం.