మీరైనా మా ఇళ్లను కాపాడండి
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:17 AM
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో తమ ఇళ్లు, స్థలాలు పోతున్నాయని హైదరాబాద్ నార్సింగ్ మునిసిపాలిటీ పరిధిలోని మధుపార్క్ అపార్ట్మెంట్ వాసులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి.
రాహుల్గాంధీకి మూసీ బాధితుల ఉత్తరాలు
నార్సింగ్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో తమ ఇళ్లు, స్థలాలు పోతున్నాయని హైదరాబాద్ నార్సింగ్ మునిసిపాలిటీ పరిధిలోని మధుపార్క్ అపార్ట్మెంట్ వాసులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. అపార్ట్మెంట్ వాసులతో పాటు స్థలాలు కోల్పోతున్న బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వందలాది ఉత్తరాలు రాశారు. వీటిని పోస్టులో రాహుల్గాంధీకి పంపిస్తామని తెలిపారు. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లను ఇప్పుడు అకస్మాత్తుగా బఫర్జోన్ పేరుతో తొలగించడం ఏంటని బాధితులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇన్నాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు ఇప్పుడు తమను రోడ్డున పడేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.