జీహెచ్ఎంసీలో ఇళ్ల దరఖాస్తుకు 2 రోజులే గడువు
ABN , Publish Date - Aug 09 , 2026 | 06:20 AM
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించనున్న ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులే గడువు ఉందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు.
16 నియోజకవర్గాల్లో 7340 ఇళ్లకు 35125 దరఖాస్తులు
20తర్వాత లాటరీ, ఏడాదిలోపు అందజేత
హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతం
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించనున్న ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులే గడువు ఉందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియెగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దరఖాస్తుదారులకు ఇళ్ల కేటాయింపునకు ఈ నెల 20 లాటరీ తీస్తామని, ఏడాది లోపు లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామన్నారు. జిహెచ్ఎంసి పరిధిలోని 16 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో నిర్మిస్తున్న 7340 ఇళ్ల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, శనివారం నాటికి 35,125 దరఖాస్తులు వచ్చాయని వి.పి.గౌతం తెలిపారు. ఈ నెల పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు. ఇండ్లు కేటాయించని పక్షంలో దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు ఫీజు రూ.10వేలు తిరిగి చెల్లిస్తామని తెలిపారు.