గతేడాది 95 శాతం కేసుల పరిష్కారం
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:22 AM
న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టడం అంటే చట్టబద్ధమైన పాలనలో పెట్టుబడి పెట్టినట్లేనని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ అన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం
హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టడం అంటే చట్టబద్ధమైన పాలనలో పెట్టుబడి పెట్టినట్లేనని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ అన్నారు. జడ్జిల కొరత ఉన్నా.. కేవలం 70 శాతం మందితోనే హైకోర్టు పనిచేస్తున్నా కేసుల పరిష్కా ర రేటు 95శాతం ఉందని చెప్పారు. గతేడాది 79వేల కొత్త కేసులు దాఖలు కాగా 75 వేల కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. సోమవారం హైకోర్టులో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ప్రసంగించారు. గతేడాది 4జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించి, 62 లక్షల కేసులు పరిష్కరించామని, లబ్ధిదారులకు రూ.3,400 కోట్లు పరిహారం అందజేశామని తెలిపారు. గతేడాది 12,891 కేసులను మధ్యవర్తిత్వానికి సిఫారసు చేయగా 1,416 కేసులు (11 శాతం) పరిష్కారమయ్యాయని చెప్పారు. ఈ ఏడాది 1.76 లక్షల కేసులు మధ్యవర్తిత్వానికి సిఫారసు చేయడానికి అనుకూలంగా ఉన్నాయన్నారు. కాగా, డీజీపీ, ఏసీబీ, టీజీపీసీబీ, ఆర్టీసీ బస్ భవన్ కార్యాలయాల్లోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.