ప్రొఫెసర్ కాశీంపై కేసుల కొట్టివేత
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:53 AM
సామాజిక బాధ్యత కలిగిన ప్రొఫెసర్గా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని కోరడం నేరం కాదని..
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సామాజిక బాధ్యత కలిగిన ప్రొఫెసర్గా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని కోరడం నేరం కాదని, అది అభినందించదగిన విషయమని హైకోర్టు అభిప్రాయపడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కాశీంపై నమోదైన కేసులను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్య చేసింది. విశ్వవిద్యాలయాల్లో రెండు వేలకు పైగా ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ 2023లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ప్రొఫెసర్ కాశీం రెండు రోజులు బహిరంగంగా తరగతులు చెబుతూ నిరసన వ్యక్తం చేశారు. ఓయూ అధికారుల ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వాటిని కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన వేర్వేరు క్వాష్ పిటిషన్లపై జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నిరసన తెలపడం నేరం కాదంటూ వాటిని కొట్టివేసింది.