Share News

బ్రాండెడ్‌ కవర్లలో నకిలీ విత్తనాలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:58 AM

అక్రమ డబ్బు సందపాదన కోసం అడ్డదారులు తొక్కి బ్రాండెడ్‌ విత్తన ప్యాకెట్లలో నకిలీ విత్తనాలు పెట్టి రైతులను దగా చేస్తున్న ముఠాలోని ముగ్గురు సభ్యులను..

బ్రాండెడ్‌ కవర్లలో నకిలీ విత్తనాలు

  • రైతులను దగా చేస్తున్న ముగ్గురి అరెస్ట్‌

  • రూ. 30 లక్షల విలువైన 2 వేల కిలోల విత్తనాలు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): అక్రమ డబ్బు సందపాదన కోసం అడ్డదారులు తొక్కి బ్రాండెడ్‌ విత్తన ప్యాకెట్లలో నకిలీ విత్తనాలు పెట్టి రైతులను దగా చేస్తున్న ముఠాలోని ముగ్గురు సభ్యులను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరి సీపీ సుమతి శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. రైతు సంపద సీడ్స్‌ అనే సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌ ప్రాంతానికి చెందిన ఏరువ బాలశౌరిరెడ్డి అలియాస్‌ శివారెడ్డి (32) ఈ అక్రమ వ్యాపారంలో సూత్రధారి. గుజరాత్‌కు చెందిన నర్మదా సాగర్‌ అగ్రిసీడ్స్‌ సంస్థకు సంబంధించిన పత్తి విత్తన ప్యాకెట్లను దొంగతనంగా రూపొందించి వాటిలో నకిలీ విత్తనాలు పెట్టి విక్రయిస్తున్నాడు. అతడికి జీడిమెట్ల హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన డిజైనర్‌ దొంగ శ్రీను (48), నిజామాబాద్‌కు చెందిన మార్కెటింగ్‌ మేనేజర్‌ కాపర్తి బెంజమెన్‌ (28) సహకరించారు. తమ సంస్థ పేరుతో నకిలీ పత్తి విత్తనాల విక్రయం జరుగుతున్నట్లు గుర్తించిన నర్మదా సాగర్‌ అగ్రిసీడ్స్‌ సంస్థ మార్కెటింగ్‌ మేనేజర్‌ తిరుమలగిరి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఓటీ సిబ్బందితో కలిసి నిందితులపై నిఘా పెట్టిన తిరుమలగిరి పోలీసులు.. పక్కా సమాచారం మేరకు బోయినపల్లి కూరగాయల మార్కెట్‌ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు, కారును స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jun 13 , 2026 | 06:59 AM