5 వేలు కడితేనే హాల్టికెట్ ఇస్తానన్న కళాశాల ఏవో
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:09 AM
హాజరు శాతం తక్కువగా ఉందని, రూ. 5 వేలు కడితేనే హాల్టికెట్ ఇస్తానని కళాశాల ఏవో తోటి విద్యార్థుల ముందు అవమానించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మనస్తాపంతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హయత్నగర్/ఆదిభట్ల, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): హాజరు శాతం తక్కువగా ఉందని, రూ. 5 వేలు కడితేనే హాల్టికెట్ ఇస్తానని కళాశాల ఏవో తోటి విద్యార్థుల ముందు అవమానించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని హయత్నగర్లో శనివారం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన మ్యాదరి ప్రణీత్కుమార్ (21) కుటుంబ సభ్యులతో కలిసి కొంత కాలంగా హయత్నగర్లో నివాసముంటూ ఇబ్రహీంపట్నం శివారులోని శ్రీఇందు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న ప్రణీత్కుమార్ పరీక్షల హాల్టికెట్ కోసం శుక్రవారం కళాశాలకు వెళ్లాడు. అయితే అతడి హాజరు శాతం తక్కువగా ఉందని రూ.5 వేలు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తానని కళాశాల ఏఓ కృష్ణమూర్తి ఇతర విద్యార్థుల ముందు ప్రణీత్కుమార్ను అవమానించారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రణీత్కుమార్ ఇంట్లోని ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎస్ఎ్ఫఐ, ఎన్ఎ్స యూఐ నాయకులతో కలిసి ప్రణీత్ మృతుదేహంతో కళాశాల ఎదుట ఆదివారం ఆందోళన చేశారు. ప్రణీత్ చావుకు కారణమైన ఏఓ కృష్ణమూర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.