స్కూటీని ఢీకొట్టి కి.మీ. ఈడ్చుకెళ్లిన డీసీఎం వ్యాను
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:18 AM
హైదరాబాద్లోని మాదాపుర్లో ఓ డీసీఎం వ్యాను శనివారం రాత్రి బీభత్సం సృష్టించింది. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది.
మహిళ మృతి.. ఆమె భర్తకు తీవ్రగాయాలు
హైదరాబాద్లోని మాదాపుర్లో ఘటన
హైటెక్సిటీ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని మాదాపుర్లో ఓ డీసీఎం వ్యాను శనివారం రాత్రి బీభత్సం సృష్టించింది. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న మహిళ మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. కేరళకు చెందిన అబ్దుల్ బాసిత్, హనియా ఆయేషా (22) దంపతులు మహేశ్వరంలో నివాసముంటూ స్థానిక మలబార్ గోల్డ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకున్న దంపతులు.. కూకట్పల్లిలో సినిమా చూసి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మాదాపుర్లోని మైండ్స్పేస్ అండర్పాస్ సమీపంలో వారు వెళ్తున్న స్కూటీని ఓ డీసీఎం వ్యాను అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు వాహనాన్ని అడ్డుకోగా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. క్లీనర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దంపతులను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయేషా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బాసిత్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు.