Share News

కరెంటు షాక్‌తో మృతి చెందిన బాలుడి కుటుంబానికి 10 లక్షలివ్వండి

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:07 AM

విద్యుత్‌ షాక్‌తో మరణించిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆ ఘటనకు బాధ్యత వహించాల్సినగోల్డెన్‌ సార్ట్‌ సంస్థను హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం-2 ఆదేశించింది.

కరెంటు షాక్‌తో మృతి చెందిన బాలుడి కుటుంబానికి 10 లక్షలివ్వండి

  • గోల్డెన్‌ స్టార్‌ సంస్థకు ఫోరం-2 ఆదేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ షాక్‌తో మరణించిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆ ఘటనకు బాధ్యత వహించాల్సినగోల్డెన్‌ సార్ట్‌ సంస్థను హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం-2 ఆదేశించింది. రాజేంద్రనగర్‌లోని పీరంచెరువు, పిబెల్‌ సిటీలో ఏడేళ్ల క్రితం 2019 ఫిబ్రవరిలో మోనీష్‌ అనే ఏడేళ్ల బాలుడు లాన్‌లో ఆడుకుంటుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడిక్కకడే మృతి చెందాడు. దీనిపై అతడి తండ్రి దివాకర్‌ కుప్పుస్వామి క్రిమినల్‌ కేసు పెట్టడంతో పాటు వినియోగదారుల ఫోరంను కూడా ఆశ్రయించారు. దీనిపై ఫోరం అధ్యక్షుడు వి.నరసింహరావు, సభ్యులు జవహర్‌ బాబు, శ్రీదేవిలతో కూడిన బెంచ్‌ సుదీర్ఘంగా విచారణ జరిపింది. బాధిత కుటుంబం పడుతున్న మానసిక వేదనకు నష్ట పరిహారంగా రూ.10 లక్షలు, ఫిర్యాదు చేయడానికైన ఖర్చు రూ.10 వేలు కలిపి రూ.10.10 లక్షలు 45 రోజులు లోపు చెల్లించాలని ఆదేశించింది. 2019 సంక్రాంతి సందర్భంగా పిబెల్‌ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లైట్లు కోసం లాన్‌లోని విద్యుత్‌ దీపస్తంభం నుంచి ఎంసీబీ తెరిచి కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. ఆ తర్వాత కొత్త ఎంసీబీ అమర్చకుండా ఉన్నదానికి టేప్‌లేసి అతికించారు. ఈ పని కూడా ఎలక్ట్రీషియన్‌ కాకుండా లిఫ్ట్‌ ఆపరేటర్‌, హౌస్‌ కీపింగ్‌ వ్యక్తి కలిసి చేశారు. కొద్ది రోజుల తర్వాత మోనీష్‌ లాన్‌లో ఆడుతూ ఆ దీపస్తంభాన్ని పట్టుకోగానే విద్యుత్‌ షాక్‌తో కుప్పకూలి గుండె నొప్పితో మృతి చెందాడు. ఇదే ఘటనపై కోర్టులో నమోదైన క్రిమినల్‌ కేసుపై విచారణ కొనసాగుతోంది.

Updated Date - Feb 23 , 2026 | 02:07 AM