ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో గంజాయి స్మగ్లింగ్
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:42 AM
గంజాయి స్మగ్లింగ్ ముఠాలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను వినియోగించుకుంటున్న విషయాన్ని ఈగల్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్లో బట్టబయలు చేశారు.
ఈగల్ ఫోర్స్ ఆపరేషన్.. డ్రైవర్తో పాటు ముగ్గురి అరెస్టు
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): గంజాయి స్మగ్లింగ్ ముఠాలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను వినియోగించుకుంటున్న విషయాన్ని ఈగల్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్లో బట్టబయలు చేశారు. ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతంలో ఉన్న గంజాయి స్మగ్లర్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లను తమ వల్లోకి లాగుతున్నారు. ఆకర్షణీయమైన కమీషన్ ఇస్తామని చెప్పి గంజాయిని బస్సుల్లో తరలిస్తున్నారు. మల్కన్గిరి నుంచి హైదరాబాద్ వస్తున్న బాబా బోలేనాధ్ ట్రావెల్స్ బస్సును వనస్ధలిపురం సమీపంలో ఈగల్ బృందాలు ఆదివారం ఉదయం తనిఖీ చేశాయి. బస్సులో తరలిస్తున్న 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని బస్సు డ్రైవర్ కోమ్లకిల్, కండక్టర్ బాబు మడకామి, హెల్పర్ లక్ష్మణ్ను అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు వాడిన బస్సును సీజ్ చేశారు. మల్కన్గిరిలో గంజాయిని బస్సులో వేసిన స్మగ్లర్ నుబీన్ పరారీలో ఉన్నాడని ఈగల్ డైరక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.