Share News

ఏటీఎంలో నింపాల్సిన డబ్బు చోరీ

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:23 AM

ఏటీఎం కేంద్రాలకు నగదును తరలించడానికి వాడే కస్టోడియన్‌ వాహనానికి చెందిన ఓ డ్రైవర్‌ పక్కా పథకం ప్రకారం చోరీ చేశాడు. ఏటీఎం కేంద్రంలో నింపేందుకు...

ఏటీఎంలో నింపాల్సిన డబ్బు చోరీ

  • నగదు పెట్టెను స్నేహితుడితో కలిసి ఎత్తుకెళ్లిన కస్టోడియన్‌ వాహన డ్రైవర్‌

  • రూ.17లక్షలతో పరారీ.. హైదరాబాద్‌లో పట్టపగలే ఘటన

హైదరాబాద్‌ సిటీ/సంతోష్‌నగర్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ఏటీఎం కేంద్రాలకు నగదును తరలించడానికి వాడే కస్టోడియన్‌ వాహనానికి చెందిన ఓ డ్రైవర్‌ పక్కా పథకం ప్రకారం చోరీ చేశాడు. ఏటీఎం కేంద్రంలో నింపేందుకు కస్టోడియన్‌ వాహనంలో ఓ ట్రంకు పెట్టెలో తెచ్చిన నగదును స్నేహితుడితో కలిసి ఎత్తుకెళ్లిపోయాడు. హైదరాబాద్‌లోని ఐఎస్‌ సదన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో రూ.17 లక్షల సొమ్ము చోరీకి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌బీఐ బ్యాంక్‌ నగదును ఏటీఎంలలో డిపాజిట్‌ చేసే టీమ్‌ పోస్‌ అనే ఏజెన్సీలో జగిత్యాలకు చెందిన శ్రీనివాస్‌ నాలుగు నెలల క్రితం కస్టోడియన్‌ వాహనం డ్రైవర్‌గా చేరాడు. మంగళవారం మధ్యాహ్నం 12.30కు ఈదీబజార్‌లో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌ ఏటీఎంలో నగదును డిపాజిట్‌ చేయడానికి వెళ్లారు. ఉద్యోగులు అక్కడున్న ఏటీఎంలో నగదు నింపుతుండగా.. ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కస్టోడియన వావానం దగ్గర ఆగాడు. అనంతరం డ్రైవర్‌ శ్రీనివాస్‌.. వాహనంలో నగదుతో ఉన్న ఓ ట్రంకు పెట్టెను తీసుకొని.. గుర్తు తెలియని వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. డబ్బు నింపుతున్న సిబ్బంది, వారితో పాటు ఉన్న సెక్యూరిటీ గార్డు అప్రమత్తం అయ్యేలోపు నిందితులు జారుకున్నారు. శ్రీనివాస్‌ ఎత్తుకెళ్లిన పెట్టెలో రూ. 17లక్షలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, సరిగ్గా నెల రోజుల క్రితం, మే 21న సుల్తాన్‌ బజార్‌ పరిధిలో ఇలాంటి చోరీనే జరిగింది. కస్టోడియన్‌ వాహన గన్‌మెన్‌ మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చేలోపు డ్రైవర్‌ వాహనంతో సహా పరారయ్యాడు. వాహనాన్ని మార్గమధ్యలో వదిలేసి అందులోని రూ.9.63 లక్షల డబ్బు తీసుకొని పారిపోయాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు 48 గంటల్లోనే అరెస్టు చేశారు.

Updated Date - Jun 24 , 2026 | 04:23 AM