Share News

హెచ్‌జే దొర పాడె మోసిన డీజీపీ శివధర్‌రెడ్డి

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:42 AM

ఉమ్మడి ఏపీలో ఐదున్నరేళ్ల పాటు డీజీపీగా పనిచేసిన హెచ్‌జే దొర అంత్యక్రియలు శనివారం జూబ్లీహిల్స్‌లోని మహప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ముగిశాయి.

హెచ్‌జే దొర పాడె మోసిన డీజీపీ శివధర్‌రెడ్డి

  • హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ రమేశ్‌ కూడా

  • మహాప్రస్థానంలో ముగిసిన హెచ్‌జే దొర అంత్యక్రియలు

హైదరాబాద్‌/రాయదుర్గం/బంజారాహిల్స్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీలో ఐదున్నరేళ్ల పాటు డీజీపీగా పనిచేసిన హెచ్‌జే దొర అంత్యక్రియలు శనివారం జూబ్లీహిల్స్‌లోని మహప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 3లో ఉన్న దొర ఇంటి నుంచి శనివారం మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభమైంది. పోలీసు అధికారులు, సిబ్బంది, అభిమానులు చాలా మంది ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. డీజీపీ శివధర్‌ రెడ్డి స్వయంగా పాడె మోశారు. ఆయనతో పాటు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ రమేశ్‌లు కూడా దొర పాడెను మోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పోలీసులు మూడు సార్లు గాల్లోకి తుపాకులు కాల్చి దొరకు గార్డ్‌ ఆఫ్‌ సెల్యూట్‌ నిర్వహించారు. అంతకుముందు దొర భౌతికకాయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, దేవేందర్‌గౌడ్‌, విశ్రాంత ఐఏఎస్‌ జయప్రకాశ్‌ నారాయణ, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన తదితరులు ఆయన నివాసంలో సందర్శించి నివాళులర్పించారు.

Updated Date - Mar 15 , 2026 | 06:42 AM