Share News

ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవ్‌

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:11 AM

హైదరాబాద్‌ జిల్లా బండ్లగూడ మండలం బండ్లగూడ విలేజ్‌ సర్వే నెంబర్‌ 62లోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌లో కట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ఎలాంటి అనుమతి లేదని ..

ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవ్‌

  • వేరే విద్యాసంస్థల ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు, హాల్‌టికెట్లు

  • హైకోర్టుకు వెల్లడించిన పాఠశాల విద్యాశాఖ

  • భవన నిర్మాణానికి అనుమతిపై స్పష్టత ఇవ్వని జీహెచ్‌ఎంసీ

  • ధర్మాసనం ఆగ్రహం

  • వారంలో కౌంటర్‌ దాఖలుకు ఆదేశం

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జిల్లా బండ్లగూడ మండలం బండ్లగూడ విలేజ్‌ సర్వే నెంబర్‌ 62లోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌లో కట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ఎలాంటి అనుమతి లేదని పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు వెల్లడించింది. ఎఫ్‌టీఎల్‌లో కట్టినప్పటికీ ఫాతిమా ఒవైసీ కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదని విజయ్‌గోపాల్‌ అనే న్యాయవాది గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సదరు విద్యా సంస్థకు ఎలా అనుమతిచ్చారన్న ధర్మాసనం ప్రశ్నకు పాఠశాల విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వెంకట్‌రాజుగౌడ్‌ సమాధానం ఇచ్చారు. ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆ కాలేజీ విద్యార్థులు హాల్‌ టికెట్లు, సర్టిఫికెట్లు ఎలా పొందుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇస్తూ.. అనుమతి ఉన్న ఇతర కాలేజీలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఉన్న విద్యార్థులు ఫాతిమా కాలేజీలో అకామిడేషన్‌ తీసుకుంటున్నారని.. అనుమతి ఉన్న ఇతర విద్యాసంస్థలు, కాలేజీల నుంచి హాల్‌టికెట్‌లు, సర్టిఫికెట్లు తీసుకుంటారని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు సదరు విద్యాసంస్థ భవన నిర్మాణానికి అనుమతి ఉందా? అనే విషయంపై జీహెచ్‌ఎంసీ స్పష్టత ఇవ్వకపోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. భవన అనుమతులు, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని మూడునెలల సమయం ఇచ్చినా ప్రభుత్వ శాఖల నుంచి సమాధానం రాలేదని పేర్కొంది. చివరి అవకాశంగా వారం రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆయా శాఖలను ఆదేశించింది. లేనిపక్షంలో ఈనెల 9వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారంతోనే ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది.

Updated Date - Jul 04 , 2026 | 06:13 AM