మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:50 AM
మధ్యవర్తిత్వం ద్వారా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని హైకోర్టు న్యాయమూర్తులు సూరేపల్లి నందా, కాజా శరత్ పేర్కొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులు సూరేపల్లి నందా, శరత్
ఖమ్మంలో మీడియేషన్ శిక్షణ కార్యక్రమానికి ప్రారంభం
ఖమ్మం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మధ్యవర్తిత్వం ద్వారా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని హైకోర్టు న్యాయమూర్తులు సూరేపల్లి నందా, కాజా శరత్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయ సేవా సదన్లో న్యాయవాదులకు నిర్వహించిన మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ సూరేపల్లి నందా మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మీడియేషన్ యాక్ట్ ద్వారా ఈ ప్రక్రియకు చట్టబద్ధత కల్పించారని, న్యాయవాదులకు మీడియేషన్పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 40 గంటల పాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. మీడియేషన్ అంగీకారంలో ఏ ఒక్కరినీ బెదిరించకూడదని కాజా శరత్ అన్నారు. రాష్ట్రంలో పది శాతం కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. మీడియేషన్ నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న 600మంది న్యాయవాదులకు శిక్షణ అందించామమని తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ స్టేట్ సెక్రటరీ పంచాక్షరి తెలిపారు.