Telangana High Court: పరిహారం విషయంలో తాత్సారంపై హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:02 AM
దాదాపు 13ఏళ్ల క్రితం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం విషయంలో తాత్సారం చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాహుల్ బొజ్జా, సుల్తానియా, లోకేశ్కుమార్ ప్రత్యక్ష హాజరుకు ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): దాదాపు 13ఏళ్ల క్రితం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం విషయంలో తాత్సారం చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు దాఖలైన ఓ కోర్టు ధిక్కరణ పిటిషన్లో ప్రత్యక్షంగా హాజరై వివరణలు సమర్పించాలని ముగ్గురు ఐఏఎ్సలకు హైకోర్టు ఫారం-1 నోటీసులు జారీ చేసింది. నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్బొజ్జా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్పకుమార్ సుల్తానియా, భూసేకరణ చీఫ్ కమిషనర్ లోకేశ్కుమార్కు ఈ నోటీసులుజారీ అయ్యాయి. శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెనాల్స్ కోసం వనపర్తి జిల్లా పానగల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన రైతులు బీ బాలస్వామి తదితరుల నుంచి భూమి సేకరించారు. కోర్టు ఇచ్చిన డిక్రీ మొత్తంలో 50శాతం మొత్తాన్ని మూడునెలల్లో డిపాజిట్ చేయాలని పేర్కొంటూ హైకోర్టు గతేడాది ఏప్రిల్లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలు చేయడంలేదంటూ రైతులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తీర్పు అమలుకు చాలా అవకాశాలు ఇచ్చినా అధికారులు అమలు చేయలేదని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది.