రైతుల పాలిట రాక్షసుడు రేవంత్రెడ్డి: హరీశ్
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:37 AM
బీఆర్ఎస్ పాలనలో రైతుల పాలిట కేసీఆర్ అపద్భాందవుడిలా మారితే, కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్రెడ్డి రాక్షసుడిలా మారాడని బీఆర్ఎస్ డిప్యూటి ఫ్లోర్ లీడర్...
సిద్దిపేట జూలై 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ పాలనలో రైతుల పాలిట కేసీఆర్ అపద్భాందవుడిలా మారితే, కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్రెడ్డి రాక్షసుడిలా మారాడని బీఆర్ఎస్ డిప్యూటి ఫ్లోర్ లీడర్, హరీశ్రావు అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా హిట్లర్లా వ్యవహరిస్తున్నాడని, పదవులు ఎవరికి, ఎప్పటికి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్లను నడిపించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిద్దిపేట జిల్లా అల్లీపూర్ గ్రామం నుంచి రంగనాయకసాగర్ వరకు రైతులు పాదయాత్ర నిర్వహించారు. 15 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో పాల్గొన్న హరీశ్రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం నుంచి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రతోనైనా సీఎం రేవంత్రెడ్డి కండ్లు తెరవాలని, లేదంటే రైతుల కోపాగ్నికి కాంగ్రెస్ ప్రభుత్వం బలికాక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం కాలం తెచ్చిన కరువు కాదని, కావాలని నీరు విడుదల చేయకుండా కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇదని మండిపడ్డారు.