పొంగులేటిని కాపాడేందుకే సీబీసీఐడీ విచారణ
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:11 AM
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడేందుకే సీబీసీఐడీ విచారణ వేశారని ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నా తమ్ముడు, బావమరిదిపై విచారణకు సహకరిస్తాం: హరీశ్రావు
హైదరాబాద్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడేందుకే సీబీసీఐడీ విచారణ వేశారని ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని అందరికీ అర్థమైందన్నారు. ఈ అంశంలో ప్రభుత్వ ఆత్మరక్షణలో పడగా సీఎం ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారనే, ఆయన్ను బెదిరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో నోటితో చెప్పలేని భాష మాట్లాడిన రేవంత్ని ఎథిక్స్ కమిటీకి ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. మైనింగ్లో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. ఇక, తన తమ్ముడు, బావమరిదిపై విచారణ జరుపతామని ప్రభుత్వం చెబుతోందని ఆ విచారణకు తాము సిద్ధమని హరీశ్ వెల్లడించారు. అయితే, సీఎం తమ్ముడు చేసిన టీడీఆర్ కుంభకోణంతో పాటు తన తమ్ముడుపై హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిట్టింగ్ జడ్జి విచారణకు సిద్థంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన 19కుంభకోణాలపై విచారణ కోరుతూ స్పీకర్ లేఖ ఇచ్చామని, ఆ అంశాలపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీశ్ డిమాండ్ చేశారు. పొంగులేటిపై హౌస్ కమిటీ వేేస ధైర్యం సర్కారుకు లేదన్నారు. కాగా, సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్యే తలసాని అన్నారు.