టెండర్ రద్దు చేశారంటే స్కాం జరిగినట్టే కదా
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:29 AM
కుంభకోణం జరగకపోతే నైనీ కోల్బ్లాక్ టెండర్ను ఎందుకు రద్దు చేశారు? బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక భట్టి విక్రమార్క ...
సోలార్ స్కాంపై మౌనమెందుకు?: హరీశ్రావు
రేవంత్ బామ్మర్దికి మేలు చేసేందుకే స్కాం: దాసోజు
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘‘కుంభకోణం జరగకపోతే నైనీ కోల్బ్లాక్ టెండర్ను ఎందుకు రద్దు చేశారు? బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక భట్టి విక్రమార్క ‘బీటింగ్ అరౌండ్ ద బుష్ (డొంక తిరుగుడు)’ లాగా వ్యవహరిస్తున్నారు. నైనీ టెండర్ రద్దు చేశారంటే అక్కడ స్కాం జరిగిందని అర్థం కావడం లేదా? అసలు విషయాన్ని పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారు’’ అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్మీట్పై హరీశ్రావు ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్రెడ్డి బావమరిది పాత్రపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. భట్టి ప్రెస్మీట్లో సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాటా మాట్లాడలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై విచారణ జరగాలంటే.. సిటింగ్ జడ్జి లేదా సీబీఐ మాత్రమే నిష్పక్షపాతంగా చేయగలవని, అందుకే తాను గవర్నర్కు లేఖ రాశానని హరీశ్ రావు పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తన బామ్మర్ది, తన అనుయాయులకు మేలు చేకూర్చేలా భారీ కుంభకోణానికి తెరలేపారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.