‘ రేవంత్..ఏం సాధించావని సువర్ణాధ్యాయం ?’
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:34 AM
తెలంగాణకు ఆర్డీఎస్ నీటివాటా విషయంలో జరుగుతున్న అన్యాయంపై పొరుగు రాష్ట్రాల నుంచి ఏం హామీ సాధించావని సువర్ణాధ్యాయం అంటున్నావ్ రేవంత్రెడ్డి.....
మన నీటిహక్కులకు ముప్పు తెచ్చే ప్రాజెక్టులను వ్యతిరేకించావా..? : హరీశ్రావు
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణకు ఆర్డీఎస్ నీటివాటా విషయంలో జరుగుతున్న అన్యాయంపై పొరుగు రాష్ట్రాల నుంచి ఏం హామీ సాధించావని సువర్ణాధ్యాయం అంటున్నావ్ రేవంత్రెడ్డి’ అంటూ బీఆర్ఎస్ నేత హరీశ్రావు సీఎంను నిలదీశారు. కేవలం కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినంత మాత్రాన రాష్ట్రానికి రావాల్సిన 15.90 టీఎంసీల నీరు ఎలావస్తుందో సీఎం సమాధానం ఇవ్వాలని.. గురువారం ఎక్స్వేదికగా ఆయన డిమాండ్ చేశారు. 75 ఏళ్లుగా పాత గేట్లు పనిచేస్తూనే ఉన్నాయని, అయినా కూడా ఆర్డీఎస్ ద్వారా రాష్ట్రానికి ఏనాడూ 5 టీఎంసీలకు మించి నీళ్లు రాలేదని గుర్తు చేశారు. డ్యామ్గేట్లు మార్చినందుకు సంబురాలు చేసుకోవడం పక్కనపెట్టి.. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి సీఎం సమాధానం చెప్పాలన్నారు. మన నీటిహక్కులకు ముప్పు తెచ్చే ప్రాజెక్టులను ఎప్పుడైనా వ్యతిరేకించావా అని ప్రశ్నించారు.