3 విడతల రైతు బంధుకు ఎగనామం: హరీశ్
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:20 AM
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులకు మూడు విడతల రైతు బంధు డబ్బులకు ఎగనామం పెట్టారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
గంగాధర, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులకు మూడు విడతల రైతు బంధు డబ్బులకు ఎగనామం పెట్టారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాల్రావుపల్లిలో ఎండిన పంటలు, వరద కాలువను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. తోటపల్లి రిజర్వాయర్ నుంచి మానకొండూర్కు కాళేశ్వరం జలాలను అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు. కాలువల్లో తుంగ, మట్టి తొలగించక, ఇతర మరమ్మతులు చేయకపోవడంతో సాగునీరందక పొలాలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీటితో పంటలు పండుతుంటే సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం లేనేలేదని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క చెరువు, చెక్డ్యాం, ప్రాజెక్టును కట్టిందిలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలు పండటం, హైదరాబాద్ వాసులతో పాటు కోటి మందికి తాగునీరు అందడం నిజమన్నారు. లక్షలాది ఎకరాలకు యాసంగిలో సాగునీరందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పదివేల ఎకరాలకు సాగునీరందించినట్లు చూపించగలరా..? అని సవాల్ విసిరారు.