Share News

కృష్ణా జలాలపై ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం దురదృష్టం: హరీశ్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:18 AM

కృష్ణాజలాల వినియోగంపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు.

కృష్ణా జలాలపై ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం దురదృష్టం: హరీశ్‌

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజలాల వినియోగంపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. అలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉండడం వల్ల తెలంగాణ జల హక్కులకు విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్‌ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. 2026 మే 2న తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) కృష్ణాబోర్డుకు రాసిన లేఖ ప్రతులను ఈ పోస్టుకు జత చేశారు. ఈఎన్‌సీ రాసిన లేఖ ప్రకారం కృష్ణానదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌ 74.23శాతం వాటాను వినియోగించుకుంటే, తెలంగాణ కేవలం 25.77శాతం మాత్రమే వాడుకుందన్నారు. ప్రభుత్వం రాసిన అధికారిక లేఖలో ఏముందో కూడా ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రికి తెలియదా ? అని హరీశ్‌ ప్రశ్నించారు. సీఎం తన వైఫల్యాలను కప్పిపుచ్చు కొనేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి.. తన రెండున్నరేళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చేసింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు.

Updated Date - Jun 06 , 2026 | 04:18 AM