గురుకులాల్లో ఏకరీతి సిబ్బంది నమూనా పెట్టండి
ABN , Publish Date - May 12 , 2026 | 04:18 AM
టీజీఎస్డబ్ల్యూఆర్ఈ సంస్థల్లో వెంటనే ఏకరీతి సాధారణ సిబ్బంది నమూనాను అమలు చేయాలని, 2026 బదిలీల ప్రక్రియను పారదర్శకంగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వ అన్ని గురుకులవిద్యాసంస్థల...
పారదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలి: టీజీఏఆర్ఐఈఏ
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి) : టీజీఎస్డబ్ల్యూఆర్ఈ సంస్థల్లో వెంటనే ఏకరీతి సాధారణ సిబ్బంది నమూనాను అమలు చేయాలని, 2026 బదిలీల ప్రక్రియను పారదర్శకంగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వ అన్ని గురుకులవిద్యాసంస్థల ఉద్యోగుల సంఘం(టీజీఏఆర్ఐఈఏ) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలగోని నర్సింహులు గౌడ్, జనరల్ సెక్రటరీ గణేశ్, డిగ్రీ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీ సత్యశ్రీదేవి నేతృత్వంలో సోమవారం సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి శారదను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, కొంతమంది వ్యక్తులు ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించి, ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ఆలస్యం చేయకుండా బదిలీలు చేపట్టాలని కోరారు. రాబోయే బదిలీల కౌన్సెలింగ్లో ఖాళీలను పూర్తిస్థాయిలో ప్రకటించాలని, ఈ ఏడాది జూన్ 30 నాటికి పదవీ విరమణ పొందే ఉద్యోగుల పోస్టులను కూడా ఖాళీలుగానే పరిగణించాలని డిమాండ్ చేశారు.