kumaram bheem asifabad- పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగం
ABN , Publish Date - May 25 , 2026 | 10:18 PM
కరెంట్ బిల్లుల మోత నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ అవసరాలను తీర్చుకునే మార్గాల అన్వేషణ నిరంతరం జరుగుతోంది. జిల్లాలో సౌర విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్ బిల్లుల భారం అధికమవుతుండడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు ప్రజలను సౌర విద్యుత్ వైపు ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా గృహాలు, వ్యాపార సంస్థలు, చిన్న పరిశ్రమల యాజమానులు తమ భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసేందుకు ముందకు వస్తున్నారు.
- ఆసక్తి చూపుతున్న జిల్లా ప్రజలు
కాగజ్నగర్, మే 25 (ఆంధ్రజ్యోతి): కరెంట్ బిల్లుల మోత నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ అవసరాలను తీర్చుకునే మార్గాల అన్వేషణ నిరంతరం జరుగుతోంది. జిల్లాలో సౌర విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్ బిల్లుల భారం అధికమవుతుండడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు ప్రజలను సౌర విద్యుత్ వైపు ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా గృహాలు, వ్యాపార సంస్థలు, చిన్న పరిశ్రమల యాజమానులు తమ భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసేందుకు ముందకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులకు భారీ సబ్సిడీలు అందుతున్నాయి. 3 కిలో వాట్ అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి రూ.78వేల వరకు అందిస్తున్నారు. ఈ పథకం కింద 25 సంవత్సరాల పాటు ట్రాన్స్ కో శాఖతో ఒప్పందం ఉండడంతో గృహాల్లో రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కేంద్రం అందించే ఆర్థిక సహాయం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
- గ్రామీణ ప్రాంతాల్లోనూ..
జిల్లాలో కూడా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సౌర విద్యుత్పై అవగాహన పెరుగుతోంది. విద్యుత్ కోతల సమస్య, పెరుగుతున్న బిల్లులు, దీర్ఘకాలిక ఆదా వంటి కారణాలతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీ రుణాలు లభించడంతో మధ్య తరగతి కుటుంబాల వారు కూడా సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకుంటే నెలకు వచ్చే విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడమే కాకుండా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కు విక్రయించే అవకాశం ఉండటంతో ఈ వినియోగంపై అంతా ఆసక్తి చూయిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించటంతో పాటు, దీర్ఘకాలిక ఖర్చు తగ్గుతుండటంతో సౌర విద్యుత్ వినియోగం మరింత పెరుగుతోంది. కాగజ్నగర్ పట్టణంల ఎస్పీఎం యాజమాన్యం తనకున్న పది ఎకరాల్లో భారీ సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. అలాగే కాగజ్నగర్ పట్టణంతో పాటు వివిధ మండలాల్లో సొలార్ ప్యానెల్ బాక్స్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 20కిపైగా ఏర్పాటు కావటం విశేషం. ప్రస్తుతం ఇంటిపై ఏర్పాటు చేసుకున్న వారి వచ్చే కరెంటు బిల్లుల్లో కూడా ఉత్పత్తి చేసిన కరెంటు బిల్లు, ఇంటికి వచ్చిన కరెంటు బిల్లును కట్ చేసుకొని ఇస్తున్నట్టు, ప్రతి నెల తమకు రూ.1000 నుంచి రూ.2000 వరకు కరెంటు బిల్లు ఆదా అవుతోందని పలువురు చెబుతున్నారు.
నిబంధనలు ఇలా..
తమ ఇంటిపై సొలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రధానంగా సొంత ఇల్లు ఉండాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం కింద ఆన్లైన్ దరఖాస్తులు చేసుకుంటే సంబంధిత బ్యాంకుకు రెఫర్ చేస్తారు. ఇందులో కూడా మీ ఆధార్ కార్డు, ప్యాన్ కార్డుతో పాటు మీ సిబిల్ స్కోర్ పరిగణలోకి తీసుకొని రుణాన్ని అందిస్తారు. 3 కిలో వాట్కి రూ.2లక్షలు రుణ ఇస్తుండగా, ఇందులో రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. ఈ డబ్బులు నేరుగా దరఖాస్తు ఇచ్చిన బ్యాం ు ఖాతాలోకి జమ చేస్తారు. మిగితా డబ్బులు కిస్తుల వారిగా కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తుండటం విశేషం. దరఖాస్తు దారుడు పూర్తి వివరాలు అందజేసిన తర్వాత నేరుగా వారం రోజుల్లోనే రుణం విడుదల చేయనుండడంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
సొలార్ ఏర్పాటు చేసుకుంటే ఉపయోగమే..:
-వెంకట్రెడ్డి, సన్రాక్, మేనేజర్
సొలార్ ఇంటిపై ఏర్పాటు చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు రుణం పూర్తి వివరాలు అందజేస్తే వారం రోజుల్లో అందజేసే అవకాశం ఉంటుంది. సొలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయిన కరెంటు నేరుగా గ్రిడ్ కొనుగోలు చేస్తోంది. 25 ఏళ్ల పాటు ట్రాన్స్కోతో ఒప్పందం ఉంటుంది. మీకు నెల వారి వచ్చే కరెంటు బిల్లులో ఉత్పత్తి చేసిన ఎమౌంటు కట్ చేసుకొని ఇస్తోంది. అధిక ఉత్పత్తి అయితే మీ కరెంటు బిల్లు పోను మిగితా డబ్బులు నేరుగా మీ ఎకౌంటులో వేసేందుకు వీలు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుకు సహకరించినట్లవుతుంది.