గోదావరిలో గల్లంతై మామ, అల్లుడు మృతి
ABN , Publish Date - May 11 , 2026 | 06:16 AM
గోదావరిలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు మామ అల్లుళ్లు గల్లంతై మృతి చెందారు.
కన్నాయిగూడెం, మే 10 (ఆంధ్రజ్యోతి): గోదావరిలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు మామ అల్లుళ్లు గల్లంతై మృతి చెందారు. ఈ ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన ప్రైవేటు పశు వైద్యుడు జిట్టా బక్కయ్య కుమారుడు విష్ణువర్ధన్(20) ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. వేసవి సెలవులు గడిపేందుకు కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నతన మేనమామ బొమ్మరాజు నరేశ్(30) ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో మామ, అల్లుడు ఈత కొట్టేందుకు గోదావరి వద్దకు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన నరేశ్ స్నేహితుడు సంపత్(పండు)ను కూడా తీసుకెళ్లారు. ముగ్గురూ నదిలోకి దిగి ఈత కొడుతుండగా నరేశ్, విష్ణువర్ధన్ లోతుల్లోకి వెళ్లి గల్లంతయ్యారు. సంపత్ సురక్షితంగా బయట పడగా, పోలీసులు నరేశ్, విష్ణువర్ధన్ మృతదేహాలను వెలికితీశారు.