‘సంపన్’ యాప్తో గోవా, కొచ్చి పోర్టుల ఒప్పందం
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:00 AM
పింఛన్ దరఖాస్తులు, చెల్లింపుల విధానాల్లో పారదర్శకత కోసం రూపొందించిన.. సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్ మెంట్ ఆఫ్ పెన్షన్...
పింఛన్దారుల సేవల్లో పారదర్శకత
రూపొందించిన కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ అధికారి సందీప్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): పింఛన్ దరఖాస్తులు, చెల్లింపుల విధానాల్లో పారదర్శకత కోసం రూపొందించిన.. సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్ మెంట్ ఆఫ్ పెన్షన్ (సంపన్) యాప్తో గోవా, కొచ్చిన్ పోర్ట్ అథారిటీలు గురువారం ఒప్పందం చేసుకున్నాయి. పింఛన్దారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు లేదా చెల్లింపుల్లో ప్రస్తుత విధానం కంటే ఈ యాప్ అత్యంత పారదర్శకంగా పనిచేస్తుండడంతోనే ఈ ఒప్పందం చేసుకున్నట్టు పోర్ట్ అథారిటీలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ప్రస్తుతం బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు తదితర వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు, జాప్యం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెన్షన్ విధానంలో దరఖాస్తు నుంచి చెల్లింపు, సమస్యల పరిష్కారం వరకు అన్నింటిని ఒకే ప్లాట్ఫామ్పైకి తెచ్చేలా కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలోని తెలుగు ఐటీసీఎస్ అధికారి సందీప్ ఈ యాప్ను రూపొందించారు. ప్రస్తుతం దాదాపు 3.3లక్షల మంది దీన్ని వినియోగిస్తున్నారు.