ఆటిజం చిన్నారుల కోసం కమ్యూనికేషన్ బోర్డు
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:11 AM
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ)తో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రపంచ ఆటిజం దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ పలు...
బంజారాహిల్స్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ)తో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రపంచ ఆటిజం దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు వద్ద కమ్యూనికేషన్ బోర్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ, అవాజ్, మర్హమ్ రిజోనేటింగ్ రెసిలెన్స్ స్వచ్ఛంద సంస్థ, సీడీసీ టాక్ లర్నింగ్, కోరుకిడ్జ్ సంయుక్తంగా ఈ బోర్డును ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, బాట్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత సైనానెహ్వాల్ ఈ కమ్యూనికేషన్ బోర్డును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సైనానెహ్వాల్ మాట్లాడుతూ.. ఆటిజంతో ఇబ్బంది పడే చిన్నారులు వారి అవసరాలను ప్రత్యేకమైన చిహ్నాల ద్వారా తెలియజేస్తారని, ఈ బోర్డు ద్వారా ఎవరైనా వారి భావాలను అర్థం చేసుకోవచ్చని చెప్పారు. జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. కమ్యూనికేషన్ బోర్డు కేవలం కేబీఆర్ పార్కులోనే కాకుండా పలు పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. ఆటిజం పిల్లలు చెప్పే విషయాలు ప్రతీ ఒక్కరు తెలుసుకునేందుకు ఈ కమ్యూనికేషన్ బోర్డు ఎంతో దోహద పడుతుందన్నారు.