గంజాయి స్మగ్లర్లతో దోస్తీ కట్టిన పోలీసులపై చర్యలు !
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:31 AM
గంజాయి స్మగ్లర్లు అయిన బొల్లా సోదరులతో దోస్తీ కట్టిన ఓ ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.
బొల్లా సోదరుల కేసు.. సైబరాబాద్ సీపీకి నివేదిక
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): గంజాయి స్మగ్లర్లు అయిన బొల్లా సోదరులతో దోస్తీ కట్టిన ఓ ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పోలీసుల వ్యవహారంపై ఈగల్ బృందం, బాలానగర్ ఏసీపీ తయారు చేసిన నివేదికలు సైబరాబాద్ సీపీ ఎం.రమే్షకు చేరినట్టు తెలిసింది. ఆ నివేదికలను పరిశీలించిన తర్వాత సీపీ.. నేడో, రేపో చర్యలు తీసుకుంటారని సమాచారం హైదరాబాద్లోని బాలానగర్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న బొల్లా సోదరులను వారం క్రితం ఈగల్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. క్యాటిరింగ్ పనులు చేసుకునే వారిలా నటించిన బొల్లా సోదరులు ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి హైదరాబాద్లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు పోలీసులతో స్నేహం పెంచుకున్నారు. బొల్లా సోదరుల గుట్టు తెలుసుకున్న ఈగల్ బృందం వారి స్థావరాలపై దాడి చేయగా. ఎదురుతిరిగారు. పోలీసులపై శునకాలను వదలడమే కాక స్ర్కూడ్రైవర్తో ఓ ఇన్స్పెక్టర్ను పొడిచారు. కానీ పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితులను విచారించగా ఓ ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లతో వారికున్న సంబంధం బయటపడింది. ఈగల్ బృందం దాడికి ఒక్క రోజు ముందు స్మగ్లర్ల గదిలోనే సదరు పోలీసులు పార్టీ కూడా చేసుకున్నట్టు తెలిసింది. వీరి మధ్య ఉన్న సంబంధాలపై ఈగల్, బాలానగర్ ఏసీపీ విచారణ జరిపి వేర్వేరుగా నివేదికలు రూపొందించి సైబరాబాద్ సీపీకి సమర్పించారు.