transformer: ట్రాన్స్‘ఫార్మర్’ వెతలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:37 AM
అలుపెరగని శ్రమజీవులు రైతులు.. బతు కు పోరు చేస్తున్న అన్నదాత కు కరెంటు కష్టాలు తప్పడంలేదు. పంట పెట్టుబడి నుం చి.. పంట చేతికొచ్చే వరకు ఆ మధ్యలో పంటను కాపాడుకునేందుకు రైతులు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. పంటకు అవసరమైన నీరు పెట్టే సమయం లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి..
ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుకు రూ.ఆరు నుంచి రూ.7 వేలు ఖర్చు
అలుపెరగని శ్రమజీవులు రైతులు.. బతు కు పోరు చేస్తున్న అన్నదాత కు కరెంటు కష్టాలు తప్పడంలేదు. పంట పెట్టుబడి నుం చి.. పంట చేతికొచ్చే వరకు ఆ మధ్యలో పంటను కాపాడుకునేందుకు రైతులు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. పంటకు అవసరమైన నీరు పెట్టే సమయం లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి.. విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇక రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో పంటలు ఎండిపోయి, దిగుబడి రాక అప్పులపాలు కావాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి-మోత్కూరు,బీబీనగర్, భువనగిరిరూరల్, వలిగొండ,తుర్కపల్లి)
ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, రైతులు సమాచారం ఇస్తే వాహనం అందుబాటులో లేదు మీరే తెమ్మని చెబుతున్నారు. దీంతో రైతులు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను ట్రాక్టర్లో తీసుకొచ్చి బాగు చేయించుకుని తీసుకెళ్తున్నారు. బాగు చేయడానికి రెండు, మూడు రోజుల సమయం తీసుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రంలో ట్రాక్టర్లోంచి దించుకోవడం, తిరిగి ట్రాక్టర్లోకి ఎత్తడం, ఆయిల్ తక్కువ ఉందని, ఇతర కారణాలు చెప్పి మరమ్మతు కేంద్రం సిబ్బంది రూ.రెండు వేల నుంచి మూడు వేలు గుంజుతున్నారని రైతులు చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడు మరమ్మతు కేంద్రం ఉన్న దూరాన్ని బట్టి తీసుకెళ్లి మరమ్మతు చేయించి, తీసుకెళ్లి బిగించడానికి రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు వేల వరకు ఖర్చవుతున్నదని, ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్న కనెక్షన్ల పై తలాకొంత పంచేసుకుని వసూలుచేసి ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు.
- శాసనమండలిలో ఎమ్మెల్సీ సత్యం
వ్యవసాయ వినియోగ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు రైతులపై ఎలాంటి భారం పడకుండా విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు కేంద్రానికి తీసుకెళ్లి మరమ్మతుచేసి 24 గంటల్లో తెచ్చి బిగించాలి. రైతులనుంచి ఒక్కరూపాయి కూడా వసూ లు చేయకూడదన్నది ప్రభుత్వ విధానం. క్షేత్రస్థాయి లో అందుకు భిన్నంగా రైతులే ట్రాన్స్ఫార్మర్లు అద్దె వా హనాలపై తీసుకెళ్లి మరమ్మతు కేంద్రంలో డబ్బులు ఇచ్చి మరమ్మతు చేయించి తెచ్చుకుని బిగించుకుంటున్నారు. అందుకు ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు సుమారు రూ.ఆరేడు వేలు ఖర్చు వస్తోందని రైతులు చెబుతున్నారు.
జిల్లాలో ఆరు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు, భువనగిరి, ఆలేరు, బీబీనగర్, చౌటుప్పల్, రామన్నపేట సబ్డివిజన్లలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాలున్నా యి. వీటిల్లో కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేస్తారు. వీటి పర్యవేక్షణకు ఎస్పీఎం ఏఈ, ఏడీఈ ఉంటారు. ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి మరమ్మ తు చేసి తీసుకెళ్లడానికి ఒక్కో కేంద్రానికి ఒక వాహ నం ఉంది. ఏడీఈ ఆధీనంలో అదనంగా మరో వాహనం ఉంటుంది.
డబ్బులు ఇవ్వనిదే మరమ్మతు కాదు..
వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడు రైతులు జూనియర్ లైన్మెన్ దృష్టికి తీసుకెళితే ఆయన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం వారికి సమాచారం ఇచ్చి వాహనం తెప్పించి ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు కేంద్రానికి పంపాలి. అక్కడ 24 గంటల్లో మరమ్మతుచేసి మళ్లీ వారి వాహనంలోనే తెచ్చి బిగించాలి. రైతులపై ఎలాంటి భారం పడకూడదు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ వెంటనే మార్చడానికి ఒకట్రెండు మరమ్మతు చేసిన ట్రాన్స్ఫార్మర్లు కేంద్రంలో సిద్ధంగా ఉంచి, వెంటనే మార్చాలి. ఇది ప్రభుత్వ విధానం. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అది అమలు కావడంలేదు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే, రైతులు సమాచారం ఇస్తే వాహనం అందుబాటులో లేదు మీరే తీసుకురమ్మని చెబుతున్నారు. దీంతో రైతులు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను ట్రాక్టర్లో మరమ్మతు కేంద్రానికి తీసుకెళుతున్నారు. కొన్ని సందర్భాల్లో వెంటనే మరమ్మతుచేసి ఇస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో రెండు, మూడు రోజులకు ఇస్తున్నారని చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రంలో ట్రాక్టర్లోంచి దించడానికని, తిరిగి ఎత్తడానికి, ఆయిల్ తక్కువ ఉందని, ఇతరత్రా కారణాలు చెప్పి మరమ్మతు కేంద్రం సిబ్బంది రూ.మూడునాలుగు వేలు గుంజుతున్నారని రైతులు చెబుతున్నారు. మరమ్మతు కేంద్రం ఉన్న దూరాన్ని బట్టి ట్రాక్టర్ అద్దె రూ.రెండు, మూడు వేలు అవుతుంది. ఇలా ఒక్కో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు రూ.ఆరేడు వేల ఖర్చు రైతులపై పడుతున్నది. ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్న రైతులు (కనెక్షన్లను బట్టి) తలా కొంత జమ చేసుకుని ఖర్చు భరిస్తున్నారు. మరమ్మతు కేంద్రాల్లో కొన్ని సందర్భాల్లో ఒక రోజులోనే మరమ్మతు చేసి ఇస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో రెండు, మూడు రోజులకు ఇస్తున్నారంటున్నారు. రెండు, మూడు రోజులకు ఇచ్చినప్పుడు వారి వా హనం అందుబాటులో ఉంటే అందులో పంపుతారని, వాహనం లేకుంటే తామే మళ్లీ ట్రాక్టర్ తీసుకెళ్లి తెచ్చుకోవాల్సి వస్తున్నదంటున్నారు.
తప్పని కష్టాలు...
బీబీనగర్ మండలంలో 15,600 ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా, అందులో బోరు బావి కింద 6,500 ఎకరాలు సాగవుతోంది. విద్యుత్ సరఫరాపై నే ఆధారపడి సాగు చేసుకుంటారు. అయితే వ్యవసాయ బోరు బావులకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు వాటి మరమ్మతు లు లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకునే బాధ్యతను, భారాన్ని రైతులే తీసుకుని అందుకు అయ్యే ఖర్చును వారే భరిస్తున్నారు. మరమ్మతుల విషయంలో విద్యుత్ సిబ్బంది వేగంగా స్పందించడంలో అలసత్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నా యి. ట్రాన్స్ఫార్మర్ను తరలించడానికి అందుబాటు లో వాహనం లేదని, మరో గ్రామానికి వెళ్లిందని రావడానికి సమయం పడుతుందని సాకులు చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులే సొం తంగా ఖర్చులు భరించి వాహనం ఏర్పాటు చేస్తే అప్పటికి గాని సిబ్బంది స్పందించరని అంటున్నారు. ఎస్పీఎంలలో కూడా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో మరొకటి కావాలంటే అక్కడి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పై అంశంపై వివరణ కోరేందుకు ట్రాన్స్కో ఏడీఈ మర్చందర్ , ఏఈ మనోహర్ రెడ్డిని ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
రైతులు భరిస్తున్న ఖర్చులు
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు కేంద్రానికి తీసుకెళ్లడానికి ట్రాక్టర్ కిరాయి రూ.2200 నుంచి రూ.3000
మరమ్మతు కేంద్రం వద్ద ట్రాన్స్పార్మర్ లోడింగ్, అన్లోడింగ్ చేయాలంటే రూ.600
కార్యాలయ ఖర్చులు అదనంగా మరో రూ.600
ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మార్చాలంటే రూ.1000
రైతులకు ట్రాన్స్ఫోర్టు చార్జీ ఇవ్వాల్సి ఉన్నా..
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రం(ఎ్సపీఎం) వాహనం అందుబాటులో లేనప్పుడు రైతులు ట్రాన్స్ఫార్మర్ ట్రాక్టర్ లేదా ఇతర వాహనంపై తెచ్చినప్పుడు మరమ్మతు కేంద్రం ఉన్న పట్టణం అయితే రూ.750, గ్రామాల నుంచి తెచ్చినట్లయితే రూ.వెయ్యి రవాణా చార్జీలు విద్యుత్ శాఖ చెల్లించాలి. ఈ విషయంపై రైతులకు అవగాహన లేక, వారు అడగటం లేదు. వీరు ఇవ్వడం లేదు. కొన్ని కేంద్రాల్లో రైతులు తెచ్చిన ట్రాన్స్ఫార్మర్లు కూడా తామే తెచ్చినట్లు రాసుకుని బిల్లులు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఫ వలిగొండ : మండలంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుకేంద్రాలు లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతూ అవస్థలు పడుతున్నారు. మండల పరిధిలో 11 సబ్స్టేషన్ల కింద 37 గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. 2,392 ట్రాన్స్ఫార్మర్లు, 44ఫీడర్లు ఉండగా వీటిలో వ్యవసాయ సాగుకు 11,745 కనెక్షన్లు, గృహ అవసరాలు, ఇతర కమర్షియల్ 19,919 కనెక్షన్లు ఉన్నాయి. అకాల వర్షాలు, ఈదురుగాలులు, ప్రకృతి వైపరీత్యాలవల్ల విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటికి మరమ్మతుకోసం రామన్నపేట, చౌటుప్పల్, భువనగిరి ఏదో ఒక కేంద్రం వద్దకు రైతులు తమ ట్రాన్స్ఫార్మర్లను తీసుకెళ్లాలి. ప్రభుత్వం రెండు మండలాలకు కలిపి ఒక వాహనం కేటాయించినా గానీ రైతులకు మేలు జరగడం లేదని విమర్శిస్తున్నారు. సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ఉండడానికి రవాణా ఖర్చులను రైతులే భరిస్తూ ట్రాన్స్ఫార్మర్లను తరలించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ నూ తన ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ప్రస్తుతం రూ.5వేల చొప్పున 3 డీడీలు చెల్లించాలి. దానికింద ఒక పోల్, ఏబీ స్విచ్, కొంత వైరు ట్రాన్స్కోవారు రైతులకు సరఫరా చేస్తారు. అదనపు స్తంభాలు, ఇతర సామగ్రి కావాలంటే రైతులే భరించాల్సి వస్తోంది.
రైతుల జేబులకు చిల్లులు
భువనగిరి మండలంలోనూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మరమ్మతులకు రైతులే తమ డబ్బులు వెచ్చించి రవాణా ఖర్చును భరిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుందని రైతులు వాపోతున్నారు. భువనగిరి టౌన్, రూరల్, తుర్కపల్లి మండలాలకు సంబంధించి ఒకే వాహనం అందుబాటులో ఉండడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు ఆ వాహనం అందుబాటు లో లేకపోవడంతో రైతులే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు వాటిని జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. మరమ్మతుల అనంతరం తమ వ్యవసాయ బావుల వద్ద అధికారుల సాయంతో అమర్చుకుంటున్నారు.
ఉన్నది ఒకే వాహనం
ఫ తుర్కపల్లి : తుర్కపల్లి మండలంలో ట్రాన్స్ఫార్మర్ల తరలింపునకు ఒకే వాహనం ఉంది. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు, ఆ వాహనం రావాలంటే రెండు మూడు రోజుల సమయం పడుతుందని, అందుకే తామే వాహనాన్ని ఏర్పాటు చేసుకొని వెళుతున్నట్లు మండల రైతులు చెబుతున్నారు. ఒకసారి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులకు రూ.6000 వరకు ఖర్చు వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
డబ్బులు తీసుకోవడం మా దృష్టికి రాలేదు : జి.శ్రీనివాసులు, ఎస్పీఎం ఏడీఈ, యదాద్రి భువనగిరి జిల్లా
టాన్స్ఫార్మర్ మరమ్మతు చేయడానికి మరమ్మతు కేంద్రంలో డబ్బులు తీసుకుంటున్న విషయం మా దృష్టికిరాలేదు. ఆయిల్ లేదనిగాని, మరే కారణం చెప్పి డబ్బులు అడిగినా మా దృష్టికి తీసుకవస్తే చర్యలు తీసుకుంటాం. వాహనం అందుబాటులో లేనప్పుడు రైతులు ట్రాక్టర్లో ట్రాన్స్ఫార్మర్ తీసుకవస్తే, వారి బ్యాంకు ఖాతా నంబరు ఇస్తే రూ.వెయ్యి రవాణా చార్జి వారి ఖాతాలో జమ చేస్తాం. ఈ విషయాన్ని రైతులు తెలుసుకోవాలి. జిల్లాలో అన్ని కేంద్రాల్లో సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసి ఇస్తున్నాం.
రైతులే రవాణా ఖర్చు భరిస్తున్నారు : ఎదునూరి మల్లేశం, రైతు అనాజీపురం
గతంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే సమాచారం ఇచ్చిన వెంటనే లైన్మెన్ వాహనంలో తీసుకుపోయి మరమ్మతులు చేసి తీసుకువచ్చేది. అయితే భువనగిరి, భువనగిరి రూరల్, తుర్కపల్లి మండలాలకు ఒకేవాహనం ఏర్పాటు చేయడంతో ట్రా న్స్ఫార్మర్ ఖర్చులు రైతులే భరించాల్సి వస్తోంది. ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను గుర్తించి ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేపట్టాలి.