నేటి నుంచి రైతు వారోత్సవాలు
ABN , Publish Date - May 04 , 2026 | 04:36 AM
ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు రాష్ట్రంలో రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తాండూరు నుంచి శ్రీకారం: తుమ్మల
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు రాష్ట్రంలో రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ‘టీజీ ఆర్గానిక్’ యాప్ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్కు టీజీ ఆర్గానిక్ యాప్ దోహదపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయశాఖతోపాటు అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. మొదటి రోజు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మట్టి ఆరోగ్యం, సమతుల ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం, రెండో రోజు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పంటల విభిన్నీకరణ, మైక్రో ఇరిగేషన్, మూడో రోజు సహకార, మార్కెటింగ్ శాఖల ద్వారా మార్కెట్ లింకేజిలు, రుణసదుపాయం, నాలుగో రోజు యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, సౌరశక్తి పరిష్కారాలపై ప్రదర్శనలు, ఐదో రోజు.. పశుఆరోగ్యం, చేపల ఉత్పత్తి పెంపు, చివరి రోజు సాగునీటిశాఖ వర్షాకాలానికి ముందస్తు చర్యలు, నీటి వనరుల నిర్వహణపై మార్గనిర్దేశనం చేస్తుందని తెలిపారు.