ధాన్యం కొనాలని రాస్తారోకో చేసిన రైతులపై కేసు
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:44 AM
ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేసిన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన ఆరుగురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు దారితీసింది.
నెన్నెల, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేసిన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన ఆరుగురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు దారితీసింది. కేసు నమోదు చేసిన 25 రోజులు తరువాత పోలీసులు ఆ రైతులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వరి ధాన్యం కొనుగోళ్లు, బస్తాల తరలింపులో జాప్యం జరగడంతో మే 20వ తేదీన గొల్లపల్లికి చెందిన రైతులు ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. ఇది తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. తాజాగా పోలీసులు ఆ రైతులకు ఫోన్ చేసి ‘మీపై కేసు ఉంది పోలీస్ స్టేషన్కు వచ్చి నోటీసులు తీసుకెళ్లండి’..అని చెప్పారు. స్థానికంగా లేకపోయినా తనపై కేసు పెట్టారని చింత సురేష్ అనే రైతు వాపోయాడు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను కొనాలని శాంతియుతంగా డిమాండ్ చేయడం కూడా తప్పేనా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై తాము హైకోర్టుకు వెళ్తామని తెలిపారు.