kumaram bheem asifabad- వాస్తవ వివరాలు నమోదు చేయాలి
ABN , Publish Date - Jun 26 , 2026 | 10:26 PM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందిస్తున్న ఎన్యుమరేషన్ ఫారంలో వాస్తవ వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కెరమెరి మండలం మల్లంగి గ్రామంలో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వివరాల నమోదు ప్రక్రియను శుక్రవారం అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పరిశీలించారు.
కెరమెరి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందిస్తున్న ఎన్యుమరేషన్ ఫారంలో వాస్తవ వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కెరమెరి మండలం మల్లంగి గ్రామంలో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వివరాల నమోదు ప్రక్రియను శుక్రవారం అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అందిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. జూలై 24వ తేదీ వరకు నిర్వహించే సర్ ఇంటింటి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, ఈ క్రమంలో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల వద్దకు వెళ్లిన సమయంలో ఎన్యుమరేషన్ ఫారం అందించినప్పుడు బీఎల్ఓ యాప్లో మార్క్ చేయాలని తెలిపారు. సదరు ఓటరు ఎన్యుమరేషన్ ఫారం నింపిన తరువాత తిరిగి సేకరించి యాప్లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. మరణించిన వారు, గ్రామం వదిలి వెళ్లిన వారు, 2 అంతకు మించి ఎపిక్ కార్డులు కలిగి ఉండడం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఒకరికి ఒక ఓటరు గుర్తింపు కార్డు మాత్రమే ఉండేలా స్పష్టమైన జాబితా రూపొందించాలని తెలిపారు. ఎన్యుమరేషన్ పారాలు నింపిన తరువాత తిరిగి సేకరించిన బీఎల్ఓ యాప్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని, ప్రక్రియ పారదర్శకం నిర్వహించాలని తెలిపారు. ప్రక్రియ నిర్వహణలో బూత్ స్థాయి ఏజెంట్లు, యువజన సంఘాల ప్రతినిధులు, వలంటీర్లు, కుల పెద్దల సహ కారం తీసుకోవాలని చెప్పారు. పొరపాట్లు లేకుండా ప్రక్రియను నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, బూత్ స్థాయి అధికారులు ఉన్నారు.