Enhanced Security for Medaram Jathara: మేడారం జాతరకు పటిష్ఠ భద్రత
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:40 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈ నెల 28 నుంచి జరుగనున్న జాతరకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
15 వేలమంది పోలీసులతో పహారా
హైటెక్ పెట్రోలింగ్ సీసీ కెమెరాలు, డ్రోన్లు
‘కమాండ్ కంట్రోల్’ నుంచి పర్యవేక్షణ
నేటి రాష్ట్ర మంత్రివర్గ భేటీకి ఏర్పాట్లు
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈ నెల 28 నుంచి జరుగనున్న జాతరకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసు అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 15 వేల మంది పోలీసులను భద్రతా విధుల్లోకి దింపనున్నారు. వీరిలో వెయ్యిమందికి పైగా మహిళా పోలీసులను నియమిస్తున్నారు. వీరే కాకుండా గ్రేహౌండ్స్, ఆక్టోపస్, క్విక్ రెస్పాన్స్ టీం లాంటి సాయుధ పోలీసులను మోహరిస్తున్నారు. మొత్తం జాతర ఏరియాను 20 సెక్టార్లుగా విభజించి ఆయా సెక్టార్ల పర్యవేక్షణ బాధ్యతలను డీఎ్సపీ స్ధాయి అధికారులకు అప్పగించనున్నారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీల రాకపోకలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న క్రమంలో వారి భద్రత కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నారు. ఇక, భక్తులు, వీఐపీ, వీవీఐపీల రాకపోకలు, పార్కింగ్కు 1462 ఎకరాల్లో 33 సెంట ర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గ్రేహౌండ్స్ బలగాలను ఇప్పటికే రంగంలో దించారు. ఇక అత్యాధునిక డ్రోన్ల సాయంతో భద్రతా ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించడానికి నిఘా బృందాలు రంగంలో దిగాయి. జంపన్న వాగు వద్ద గజఈతగాళ్లను, 12 క్రైం పార్టీలను ఏర్పా టు చేస్తున్నారు. ఫుట్, బైక్ పెట్రోలింగ్ బృందాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానమయ్యేలా 500 పైగా సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. భద్రతపై డీజీపీ శివధర్రెడ్డి పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి సూచనలు చేశారు. కాగా, మేడారంలో ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనిపై డీజీపీ శనివారం సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
మేడారం... జన సందోహం
తాడ్వాయి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మేడారం భక్తజన సంద్రమైంది. సమ్మక్క-సారలమ్మలకు భక్తు లు శనివారం మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీ్సగఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారుల అంచనా.