రాత్రి వేళ కరెంట్ కొనాలంటే షాకే!
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:48 AM
దేశమంతా వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండగా... కరెంట్ ధరలు కూడా ఉక్కపోతకు గురి చేస్తున్నాయి.
బహిరంగ విపణిలో యూనిట్ ధర రూ.10పైనే
పగటి పూట సౌర విద్యుత్ అందుబాటులోకి రాగానే రూ.1కి పడిపోతున్న యూనిట్ ధర
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): దేశమంతా వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండగా... కరెంట్ ధరలు కూడా ఉక్కపోతకు గురి చేస్తున్నాయి. బహిరంగ విపణి(ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్)లో రాత్రి వేళ 12 గంటలపాటు యూనిట్కు రూ.10కి తగ్గకుండా కరెంట్ అమ్ముడుపోతుంది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య యూనిట్ కరెంట్ రూ.10కి అమ్ముడుపోగా... మళ్లీ సాయంత్రం 6:15 నుంచి రాత్రి 11:45 గంటల దాకా అదే రేటు కొనసాగింది. ఇక, పగటి పూట సౌర విద్యుత్ ఉత్పాదన ప్రారంభం కాగానే కరెంట్ ధర భారీగా తగ్గిపోతుంది. ఉదయం 7 నుంచి 7:15 గంటల బ్లాక్లో రూ.4కు యూనిట్ అమ్ముడుపోగా, క్రమంగా తగ్గుతూ మధ్యాహ్నం 1 గంటకు రూ.1కే యూనిట్ విక్రయించారు. బహిరంగ విపణిలో ప్రతి 15 నిమిషాలకు ఒక బ్లాక్ చొప్పున... 96 బ్లాకుల్లో కరెంట్ విక్రయాలు జరుగుతుంటాయి.