kumaram bheem asifabad- గిరిజనుల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 20 , 2026 | 10:24 PM
జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేస్తామని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లాలో మొదటి మహిళా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హరిత మంగళవారం కెరమెరి మండలం జోడేఘాట్లోని కుమరం భీం సమాధి వద్ద పూజలు నిర్వహించారు. భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
కెరమెరి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేస్తామని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లాలో మొదటి మహిళా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హరిత మంగళవారం కెరమెరి మండలం జోడేఘాట్లోని కుమరం భీం సమాధి వద్ద పూజలు నిర్వహించారు. భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజియంను సందర్శించి మ్యూజియంలో పొందుపరిచిన అలంకరణలు, చిత్రాలు, గిరిజన సంస్కృతికి సంబంధించిన చరిత్రను తిలకించి ఆదివాసీ నాయకులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. జోడేఘాట్ గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకు ముందు గ్రామానికి విచ్చేసిన కలెక్టర్ను ఆదివాసీలు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో ఈ నెల 26న రిపబ్లిక్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కటెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి వేడుకల ఏర్పాట్లపై జిల్లా అదికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిపబ్లిక్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. వేడుకల నిర్వహణకు పర్యవేక్షకులుగా అదనపు కలెక్టర్ వ్యవహరిస్తారని చెప్పారు. ప్రోటోకాల్, ప్రముఖులు, వేదిక, పోడియం నిర్వహణ ఆర్డీవో, స్థానిక తహసీల్దార్ వ్యవహరిస్తారని తెలిపారు. వేదిక, పొడియం అంకరణ జిల్లా ఉద్యానవన అధికారి పర్యవేక్షించాలని అన్నారు. మినిట్ టూ మినిట్ కార్యక్రమాలన్ని జిల్లాఎస్పీ పర్యవేక్షిస్తారని తెలిపారు. అతిథులకు కుర్చీలు, తాగునీరు, స్నాక్స్ అందించాలని, వీడియోగ్రఫీ, ప్రెస్ గ్యాలరీని జిల్లా పౌర సంబంధాల అదికారి పర్యవేక్షించాలని తెలిపారు. ప్రసంగ ప్రతి రూపొందించేందుకు పట్టణ ప్రణాళికాధికారి, జిల్లా పౌరసంబంధిల అధికారి సమన్వయం చేసుకోవాలని చెప్పారు. వేడుకలలో పారిశుధ్య పనులు, నిరంతర విద్యుత్ సరఫరా పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల జాబితాను ఈ నెల 24వ తేదీన కలెక్టరేట్ పీవోకు అందించాలని సూచించారు. వేడుకలలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులపై స్టాల్స్ ప్రదర్శించాలన్నారు. విద్యార్థులచేత దేశభక్తి గీతాలపై సాంస్కృతిక ప్రదర్శణ ఉండేలా చూడాలని సూచించారు. జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.