అమోయ్ కుమార్పై ఈడీ ప్రశ్నల వర్షం!
ABN , Publish Date - May 26 , 2026 | 04:59 AM
మహేశ్వరం భూదాన్ భూముల అక్రమ బదిలీలు, ధరణిలో రికార్డుల మార్పులు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్....
మహేశ్వరం భూదాన్ భూముల అక్రమాలపై 7 గంటలు ప్రశ్నించిన ఈడీ
నాగారం భూముల అక్రమాలపైనా ఈడీ దృష్టి
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): మహేశ్వరం భూదాన్ భూముల అక్రమ బదిలీలు, ధరణిలో రికార్డుల మార్పులు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం దాదాపు ఏడు గంటలపాటు ప్రశ్నించారు. మనీలాండరింగ్ కోణంలో సాగుతున్న ఈ దర్యాప్తులో భాగంగా ఆయన ఈడీ అధికారులకు కీలక పత్రాలు సమర్పించినట్లు సమాచారం. మూడు వివాదాస్పద ేసల్ డీడ్లు 1,209, 1,212, 4,594లకు సంబంధించిన అసలు పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తుల లావాదేవీల సమాచారం, భూముల బదిలీలకు సంబంధించిన డాక్యుమెంట్లను విచారణకు అమోయ్ కుమార్ తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ేసల్ డీడ్లలో నమోదైన భూముల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని ఈడీ ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. మహేశ్వరం పరిధిలోని సుమారు 42 ఎకరాల భూదాన్ భూములు అక్రమంగా బదిలీ అయ్యాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ధరణి పోర్టల్లో రికార్డుల మార్పులు, 22జీ జాబితాలో ఉన్న నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఎలా జరిగాయన్న అంశాలపై అధికారులు లోతుగా ఆరా తీసినట్లు తెలిసింది. భూముల స్వరూపం, అసలు యాజమాన్యం, ప్రభుత్వ అనుమతులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.రిజిస్ట్రేషన్న్ల సమయంలో ఉపయోగించిన బ్యాంకు ఖాతాలు, ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే భూదాన్ భూముల అక్రమాలపై జరిగిన విజిలెన్స్ విచారణ నివేదికలను కూడా ఈడీ సేకరించినట్లు సమాచారం. ఆ నివేదికల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తదుపరి విచారణ సాగుతున్నట్లు తెలిసింది. గతంలోనూ పలుమార్లు అమోయ్ కుమార్ను ఈడీ ప్రశ్నించింది. మరోవైపు నాగారంలోని సర్వే నంబర్లు 181, 182లోని భూముల వ్యవహారంపైనా ఈడీ దృష్టి పెట్టింది ఈ వ్యవహారంలో మరికొందరికి త్వరలో నోటీసులు జారీచేేస అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.