నౌహీరా షేక్ సహాయకురాలి అరెస్టు
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:27 AM
హీరా గ్రూపు మోసం కేసులో ఈడీ అధికారులు ఆ గ్రూపు యజమాని నౌహీరా షేక్ వ్యక్తిగత సహాయకురాలు నజ్నీన్ అన్సారీని అరెస్టు చేశారు...
ఈడీ అటాచ్ చేసిన ఆస్తులకు అద్దె వసూలు చేసిన వైనం
హైదరాబాద్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): హీరా గ్రూపు మోసం కేసులో ఈడీ అధికారులు ఆ గ్రూపు యజమాని నౌహీరా షేక్ వ్యక్తిగత సహాయకురాలు నజ్నీన్ అన్సారీని అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో మంగళవారం సోదాలు నిర్వహించి.. పలు సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఆమెను అరెస్టు చేశామని ఈడీ అధికారులు బుధవారం ప్రకటించారు. ఇప్పటికే నౌహీరా షేక్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. నౌహీరా షేక్కు సంబంధించిన పలు ఆస్తులను అటాచ్ చేశారు. వాటిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేలంలో అమ్మడానికి సన్నాహాలు చేస్తుండగా నజ్నీన్ అన్సారీ అడ్డంకులు సృష్టించారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఆస్తుల పరిశీలనకు వచ్చిన వారికి లోనికి అనుమతించవద్దని తమ సిబ్బందికి ఆమె ఆదేశాలిచ్చారని, ఉద్దేశపూర్వకంగా వేలం ప్రక్రియను అడ్డుకునే చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆ ఆస్తులను అద్దెకు తీసుకున్న వారి నుంచి నెలవారీ అద్దెలు వసూలు చేయడం, అధికారులను తప్పుదోవ పట్టించే చర్యలకు నజ్నీన్ పాల్పడ్డారని తెలిపారు.