గ్లోబల్ ఫోరం ఆఫ్ క్యాన్సర్ సర్జన్స్ అధ్యక్షుడిగా డాక్టర్ టీఎస్ రావు
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:11 AM
గ్లోబల్ ఫోరం ఆఫ్ క్యాన్సర్ సర్జన్స్ అధ్యక్షుడిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చి ఇనిస్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్, సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ టి. సుబ్రమణ్యేశ్వర రావు....
తొలిసారి భారతీయ వైద్యుడి ఎన్నిక
హైదరాబాద్ సిటీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ ఫోరం ఆఫ్ క్యాన్సర్ సర్జన్స్ అధ్యక్షుడిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చి ఇనిస్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్, సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ టి. సుబ్రమణ్యేశ్వర రావు(డాక్టర్ టీఎస్ రావు) ఎన్నికయ్యారు. ఈ పదవికి తొలిసారిగా భారతీయ వైద్యుడు ఎన్నిక కావడం విశేషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆస్పత్రి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ టీఎస్ రావును బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ సత్కరించారు. డాక్టర్ టీఎస్ రావు మాట్లాడుతూ.. గ్లోబల్ ఫోరం ఫర్ క్యాన్సర్ సర్జన్స్కు ఎపుడూ పాశ్చాత్య దేశాల ప్రతినిధులే అధ్యక్షుడిగా ఉండేవారని, తొలిసారిగా గ్లోబల్ సౌత్ ప్రతినిధిగా తాను ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. పేదలకు క్యాన్సర్ చికిత్స అందుబాటులోనికి తీసుకొచ్చే లక్ష్యం దిశగా పనిచేస్తానని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైతు కుటుంబంలో పుట్టిన తాను ఈ స్థాయికి చేరుకోవడం కుటుంబ సభ్యులు, మిత్రులు, తనతో పనిచేసిన సిబ్బంది సహకారంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ పిల్మ్ ఫెస్టివల్లో లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణను కూడా బసవతారకం ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది ఘనంగా సత్కరించారు.