టీసీఎస్ సహకారంతో ‘డిజిటల్ యాదగిరి’!
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:51 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుమల తరహాలో డిజిటల్ పరిజ్ఞానంతో భక్తులకు సేవలు అందించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
యాదాద్రి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుమల తరహాలో డిజిటల్ పరిజ్ఞానంతో భక్తులకు సేవలు అందించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్వామివారికి ఉచితంగా సేవలు అందించనుంది. యాదగిరిగుట్ట ఆలయంలో పరిపాలన వ్యవహారాల నుంచి భక్తులకు వసతి సదుపాయాలు, స్వామివారి దర్శనాలు, ప్రసాదాలు, ఆర్జిత సేవలను ఒకే క్లిక్తో వేగవంతంగా, పారదర్శకంగా అందించడానికి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయనుంది. యాదగిరిగుట్ట దేవస్థానం మాత్రం హార్డ్వేర్ నెట్వర్క్ను సమకూర్చాల్సి ఉంటుంది. టీసీఎస్ ఉన్నతస్థాయి ఐటీ నిపుణుల బృందం, ఆలయ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్, ఆయా శాఖల అధికారులతో వారం రోజులుగా సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఆరు నెలల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.