రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ లేరు
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:10 AM
రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ లేరని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టు సానుభూతిపరులు ఉండవచ్చేమో కానీ, సాయుధ నక్సలైట్లు మాత్రం లేరని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ‘అరైవ్ అలైవ్’
ప్రజలకు మరింత చేరువగా పోలీస్ వ్యవస్థ: డీజీపీ
కోల్సిటీ/కన్నెపల్లి/ఆసిఫాబాద్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ లేరని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టు సానుభూతిపరులు ఉండవచ్చేమో కానీ, సాయుధ నక్సలైట్లు మాత్రం లేరని స్పష్టం చేశారు. మావోయిస్టు గణపతి ఎప్పుడు లొంగిపోతారనే విషయమై తమకు సమాచారం లేదని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన పోలీస్ గృహ సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. గతంలో రవాణా శాఖ మాత్రమే రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించేదని, ఈసారి ప్రభుత్వంలోని అన్ని శాఖలు భాగస్వాములు అవుతాయన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో నిర్మించిన పోలీ్సస్టేషన్ను డీజీపీ ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్మించిన లైబ్రరీని ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.