Share News

పోస్టింగ్‌ల కోసం నిరీక్షించే పరిస్థితి లేదు

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:02 AM

ఐపీఎస్‌ అధికారులు గతంలో రెండేళ్లపాటు పోస్టింగ్‌లులేకుండా చీఫ్‌ ఆఫీస్‌లో వెయిటింగ్‌లో ఉండాల్సిన పరిస్థితులుండేవని, ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క అధికారి ఖాళీగా ఉండకుండా అందరికీ సీఎం....

పోస్టింగ్‌ల కోసం నిరీక్షించే పరిస్థితి లేదు

  • ఆఫీసర్స్‌ రిట్రీట్‌ కార్యక్రమంలో డీజీపీ శివధర్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఐపీఎస్‌ అధికారులు గతంలో రెండేళ్లపాటు పోస్టింగ్‌లులేకుండా చీఫ్‌ ఆఫీస్‌లో వెయిటింగ్‌లో ఉండాల్సిన పరిస్థితులుండేవని, ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క అధికారి ఖాళీగా ఉండకుండా అందరికీ సీఎం రేవంత్‌ రెడ్డి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీసు విభాగంలో ఐపీఎస్‌ అధికారుల మధ్య సమన్వయం, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ‘ఆఫీసర్స్‌ రిట్రీట్‌’ కార్యక్రమం ముగింపు వేడుకల్లో పాల్గొన్న శివధర్‌రెడ్డి అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణలో నిర్ణయాలు తీసుకోవడంలో ఎంత కఠినంగా ఉంటారో, బాధితుల పట్ల అంతే సానుభూతితో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆఫీసర్స్‌ రిట్రీట్‌ సంప్రదాయాన్ని 24 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. రోడ్డు రవాణా, భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి రవాణా, పోలీస్‌ శాఖలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా టీజీ పోలీస్‌ అకాడమీ మాన్యువల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్ర్టెంథనింగ్‌ యూనిట్‌ ఏర్పాటుపై టీజీపీఏ, యూనిసెఫ్‌‌ల మధ్య ఎంవోయూ కుదిరింది. కార్యక్రమంలో పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాషబిస్త్‌, టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 04:02 AM