డీఏపీ.. డీలర్ల దోపిడీ
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:57 AM
జిల్లాలోని పలు చోట్ల డీఏపీ ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ఽకంటే అధిక ధరలకు విక్రయిస్తూ పలువురు వ్యాపారులు రైతులను ఆర్థికంగా నష్టపరు స్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఇటీవల ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్
జగిత్యాల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు చోట్ల డీఏపీ ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ఽకంటే అధిక ధరలకు విక్రయిస్తూ పలువురు వ్యాపారులు రైతులను ఆర్థికంగా నష్టపరు స్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఇటీవల ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక డీఏపీ ఎరువుల బస్తా అధికారిక ఎమార్పీ రూ. 1,360 మాత్రమే ఉండగా, ప్రస్తుత వానాకాలం సీజన్లో డిమాండ్ను ఆసరాగా చేసుకొని కొంత మంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వారు ఒక్కో బస్తాను రూ.1,500 నుంచి రూ.1,950 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పీఏసీఎస్లకు, డీసీఎంఎస్ కేంద్రాల్లో స్టాక్ ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఫఅధికారుల విచారణ..
జిల్లాలో డీఏపీ, యూరియా విక్రయాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, కృతిమ కొరత సృష్టిస్తూ కొందరు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీలయిన బీజేపీ, బీఆర్ఎస్లు కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారు. జగిత్యాలకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ ఇన్చార్జి బోగ శ్రావణి, బీఆర్ఎస్కు చెందిన జడ్పీ మాజీచైర్ పర్సన్ దావ వసంత వేర్వేరుగా కలెక్టర్ సత్యప్రసాద్ను కలిసి సమస్యను వివరిస్తూ ఫిర్యాదులు చేశారు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో ప్రకృతి రైతును పరీక్షిస్తుంటే, మరో వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్లాక్ మార్కెట్ మాఫియా రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. పంటను కాపాడుకోవాలనే ఆత్రంతో రైతు ఎంత ధర చెప్పినా ఎరువులు కొనాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫఅక్రమ విక్రయాలపై ఫిర్యాదు ఇలా..
ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా, రశీదు ఇవ్వడానికి నిరాకరించినా రైతులు వెంటనే పలువురు అధికారులను ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఆయా రైతుల పరిధిలోని మండల వ్యవసాయ అధికారి (ఏవో)లను కలిసి నేరుగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా స్థాయిలో ఉండే వ్యవసాయ శాఖ ముఖ్య అధికారికి ఫిర్యాదు సమర్పించవచ్చు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ను నేరుగా కలిసి వినతిపత్రం అందజేయవచ్చు. ఎరువుల బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలపై నిఘా ఉంచే వ్యవసాయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించుకునే అవకాశాలున్నాయి.
ఫఇవీ నిబంధనలు..
అధిక ధరలకు విక్రయించే డీలర్ల ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ చట్టం ప్రకారం లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది. ఎరువుల నాణ్యత, ధర, పంపిణీని నియంత్రించడానికి ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985లో ఏర్పాటు చేయబడింది. ఇది నాణ్యమైన ఎరువులను అందించడం, ధరలను నియంత్రించడం, కల్తీని అరికట్టడం వంటి ప్రధాన విధులను కలిగి ఉంది. రైతులు కొనుగోలు చేసే ఎరువులు నిర్ధేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. ఎరువుల గరిష్ఠ ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనివల్ల డీలర్లు అదనపు ధలకు అమ్మడానికి వీలుండదు. నాసిరకం, కల్తీ ఎరువుల అమ్మకాలను అరికట్టి రైతులను రక్షించడానికి చట్టం ఉపయోగపడుతుంది.
రైతులు పాటించాల్సినవి..
ఫఎరువులు కొనుగోలు చేసినప్పుడు డీలర్లు నుంచి కచ్చితంగా కంప్యూటరైజ్డ్ లేదా పీఓఎస్ మిషన్ రశీదును అడగాలి. బిల్లు లేకుండా ఎరువులు కొనొద్దు.
ఫ ప్రతి దుకాణదారుడు తమ వద్ద ఉన్న ఎరువుల నిల్వలు, వాటి ధరల వివరాలను బోర్డుపై ప్రదర్శించడం తప్పనిసరి.
ఫ ఎరువులతో పాటు ఇతర మైక్రో న్యూట్రియెంట్లు లేదా పురుగుల మందులను బలవంతంగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి తెస్తే దానిని రైతులు అంగీకరించాల్సిన అవసరం లేదు.
ఫప్రస్తుతం మార్కెట్లో ఉప్పు, రంగులు, కెమికల్స్ కలిపిన నకిలీ డీఏపీ ముఠాలు తిరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. గుర్తింపు పొందిన అధికారిక డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలి.
చర్యలు తీసుకోవాలి
- బోగ శ్రావణి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి, జగిత్యాల
జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో డీఏపీ యూరియా కృతిమ కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెట్కు పాల్పడడం, రైతుల అవసరాలను ఆసరగా చేసుకొని అధిక ధరలకు విక్రయించడం దురదృష్టకరం. అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
డీలర్ల లైసెన్స్ రద్దు చేయాలి
-దావ వసంత, జడ్పీ మాజీ చైర్పర్సన్
జిల్లాలో డీఏపీ యూరియా బ్లాక్ మార్కెట్ మాఫియా రైతులను ఆర్థికంగా దెబ్బతిస్తోంది. బ్లాక్ మార్కెట్ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఎరువుల దుకాణాలపై తనిఖీలు నిర్వహించి, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లు లైసెన్సులు రద్దు చేయాలి. యూరియా, డీఏపీ ఎరువుల ఎమ్మార్పీకే అందేలా కేంద్రం, రాష్ట్రం సంయుక్త పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. బ్లాక్ మార్కెట్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.