Share News

బెయిల్‌పై బయటికొచ్చాక సైబర్‌ నేరగాళ్లు గాయబ్‌

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:52 AM

సైబర్‌ నేరగాళ్లు గాయబ్‌ అవుతున్నారు. సైబర్‌ నేరాల కట్టడి, సైబర్‌ నేరగాళ్లపై నిరంతర నిఘా కోసం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున.....

బెయిల్‌పై బయటికొచ్చాక సైబర్‌ నేరగాళ్లు గాయబ్‌

  • అడ్రస్‌లు మార్చేసి తప్పించుకు తిరుగుతున్న వైనం

  • పోలీసుల ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌-2తో వెలుగులోకి..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు గాయబ్‌ అవుతున్నారు. సైబర్‌ నేరాల కట్టడి, సైబర్‌ నేరగాళ్లపై నిరంతర నిఘా కోసం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌-2ను ప్రారంభించి పరిశీలన చేపట్టగా.. కొందరు సైబర్‌ నేరగాళ్లు మాయమైనట్టు వెల్లడైంది. 2024-25లో రాష్ట్రంలో మొత్తంగా 3,567 మంది సైబర్‌ నేరగాళ్లు అరెస్టు అయ్యారు. వీరిలో 614మందిని ఎంపిక చేసి ముఖ్యంగా ఆర్థిక నేరాల్లో కీలక పాత్ర ఉన్నవారిపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు నిఘా పెట్టారు. అయితే ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 300 బృందాలు సమన్వయంతో పనిచేస్తూ నిందితుల ప్రస్తుత నివాసం, వృత్తి, ప్రవర్తన తదితర అంశాలపై క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ చేపట్టాయి. రాష్ట్రంలో 480 కేసులు, దేశవ్యాప్తంగా 1,233 కేసుల్లో సంబంధం ఉన్న 335 మంది నిందితులను తొలి దశలో వెరిఫై చేయగా వీరిలో 115 మంది ఎక్కడున్నారో తెలియకపోవడం ఆందోళనకరంగా మారింది. 218 మంది ఆచూకీ తెలియగా.. వీరిలో ముగ్గురు మరణించినట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దాదాపు 34 శాతం మంది సైబర్‌ నేరగాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చాక చిరునామాలు మార్చడం, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, గుర్తు తెలియకుండా జీవించడం ద్వారా పోలీసు నిఘా నుంచి తప్పించుకున్నట్లు తొలి దశలో సైబర్‌ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. అయితే సైబర్‌ నేరాలకు సంబంధించి కరడుగట్టిన నేరగాళ్లు తాత్కాలికంగా చిరునామాలు మార్చి తప్పించుకున్నా వారిని ట్రాక్‌ చేస్తూనే ఉంటామని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు స్పష్టం చేశారు. సైబర్‌ నేరాల్లో అరెస్టు అయిన వారిపై పెద్ద ఎత్తున చేపట్టిన తొలి పర్యవేక్షణ చర్య ఇది అని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్‌ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా నిందితుల ప్రస్తుత చిరునామా నిర్ధారణ, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్‌ కార్యక్రమాల పర్యవేక్షణ, సహచరుల నెట్‌వర్క్‌ గుర్తింపు, బెయిల్‌ నిబంధనల అమలు, అనుమానాస్పద ప్రవర్తనపై నిఘా కొనసాగుతుందని ఆమె తెలిపారు. సైబర్‌ నేరాలపై జీరో టాలరెన్స్‌ విధానాన్ని కొనసాగిస్తూనే.. ఇప్పటికే సైబర్‌ నేరాల్లో అరెస్టు అయిన నిందితులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా పర్యవేక్షించడమే ఈ ఆపరేషన్‌ ముఖ్యోద్దేశమని ఆమె తెలిపారు. పరారీలో ఉన్న వారిలో ప్రసాద్‌ కుమార్‌ అనే నిందితుడు నేపాల్‌లో ఉన్నట్లు గుర్తించామన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 04:52 AM