12 ఏళ్ల తెలంగాణలో ప్రజల బతుకులు మారలేదు
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:50 AM
12 ఏళ్ల తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అట్టడుగు వర్గాల ప్రజల బతుకులు మారలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ చెప్పారు.
మీట్ది ప్రెస్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, జూన్ 6(ఆంధ్ర జ్యోతి): 12 ఏళ్ల తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అట్టడుగు వర్గాల ప్రజల బతుకులు మారలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ చెప్పారు. అసమానతలు పెరిగే కొద్దీ తిరుగుబాటు అనివార్యం అవుతుందన్నారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మీట్ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం పాలకవర్గాలకు ఏటీఎంలుగా మారాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఉద్యోగాల భర్తీని విస్మరించిందన్నారు. డిగ్రీలు, పీజీలు చదువుకున్న యువకులు ఉద్యోగాలు రాక అడ్డా కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. తెలంగాణలో మత విద్వేషాలతో అధికారంలోకి రావాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 9 కమ్యునిస్టు పార్టీలు ఉన్నాయని, రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వామపక్ష పార్టీలు కలిసికట్టుగా ముందుకెళతాయన్నారు. కమ్యునిజంపై పవన్ కల్యాణ్ అవగాహన లేని మాటలు మాట్లాడారనిచెప్పారు. నియోజకవర్గాల పునర్ విభజనలో దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని జాన్వెస్లీ చెప్పారు.