సీఎం రేవంత్రెడ్డి కేరళలో మతిభ్రమించి మాట్లాడుతున్నారు: సీపీఎం
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:12 AM
విజయన్కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనని కేరళలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటాన్ని తాము ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): విజయన్కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనని కేరళలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటాన్ని తాము ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. మోదీ- విజయన్ బ్రదర్స్ అని అక్కడి ఎన్నికల ప్రచారంలో సీఎం మతిభ్రమించి మాట్లాడుతున్నారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన అపరిచితుడిలా మారి మాట్లాడుతున్న ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. కేరళలో విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి 24 శాతం నిధులు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం కేవలం 8 శాతం మాత్రమే కేటాయించిందన్నారు. అక్కడ వైద్యం ఉచితంగా ఉండగా.. ఇక్కడ వ్యాపారంగా మారిందని విమర్శించారు. సామాజిక న్యాయం, సంక్షేమం, మత సామరస్యంలో కేరళ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేరళను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు.